అంతా ఆయ‌నే.. చ‌క్రం తిప్పుతున్న స‌జ్జ‌ల‌!

సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. వైసీపీలో నాయ‌కుడు, వ్యూహాత్మ‌క నేత‌, సీఎం రాజ‌కీయ స‌ల‌హాదారు. ఇంత వ‌రకేనా ఆయ‌న విధులు. అంటే.. కాద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఆయ‌న షాడో చీఫ్ మినిస్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పార్టీలో కొన్నాళ్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది. త‌మ‌కు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. నేరుగా సీఎం జ‌గ‌న్‌కు చెప్పుకొనే అవ‌కాశం ఏనాడో పోయింద‌ని నేత‌లు బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకొనేందుకు సీఎం అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని.. ఏదైనా ఉంటే.. స‌జ్జ‌ల‌సార్‌తో మాట్లాడండి.. అని సీఎంవో నుంచి స‌మాచారం అందుతోంద‌ని.. పోనీ వెళ్లిఆయ‌న‌కు స‌మ‌స్య చెప్పినా.. వెంట‌నే ప‌రిష్కారం అయ్యే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.

ఇది కొంద‌రి మాట‌. మ‌రికొంద‌రు ఏమంటున్నారంటే.. స‌జ్జ‌ల త‌న‌కు అనుకూలంగా ఉండే వారికి ప‌నులు చేస్తున్నార‌ని.. చెబుతున్నారు. తాజాగా గుంటూరు ఘ‌ట‌న వెలుగు చూసిన త‌ర్వాత‌.. ఈ విష‌యంపై నేత‌లు బ‌హిరంగ వ్యాఖ్య‌లే చేస్తున్నారు. గుంటూరులో ఓ ఎంపీ-ఎమ్మెల్యే మ‌ధ్య తీవ్ర వివాదం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఇది అంత‌ర్గ‌త విష‌యం. ఇప్ప‌టికే ఎంపీ.. స‌ద‌రు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. త‌నకు స్వేచ్ఛ‌లేకుండా చేస్తున్నార‌ని, దీనిని ప‌రిష్క‌రించాల‌ని, త‌న కారుపై దాడికి ఇప్ప‌టికే రెండు సార్లు ప్ర‌య‌త్నించార‌ని.. ఇలా అయితే..ఎలా? అంటూ ఎంపీ త‌న ఆవేద‌న‌ను స‌జ్జ‌ల వ‌ద్దే చెప్పుకొచ్చారు.

అయినా.. ఇప్ప‌టికీ స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోగా.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేయ‌డంతో చ‌ర్య‌లు తీసేసుకున్నారు. ఇక‌, ప్ర‌కాశంలో నేత‌లు రెండు నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో ఘ‌ర్ష‌ణ ప‌డుతున్నారు. కొండ‌పిలో ఇంచార్జ్ మాదాసు వెంక‌య్య స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అదేస‌మ‌యంలో అద్దంకిలో చెంచు గ‌ర‌ట‌య్య కుమారుడు చైత‌న్య కూడా త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఏదైనా స‌మ‌స్య ఉంటే వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. దీనిని కూడా స‌జ్జ‌ల‌కే రిఫ‌ర్ చేశారు. ఆయ‌న మాత్రం మీలో మీరు తేల్చుకుని రండి అప్పుడు చూద్దాం.. అని ముక్తాయించారు.

పైగా ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను తీసుకుంటాం.. అప్పుడు మీ తిక్క అణుగుతుంది! అని దురుసుగా వ్యాఖ్యానించార‌ట‌. దీంతో సజ్జ‌ల వ్య‌వ‌హారంపై నాయ‌కులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం నిదుల విష‌యంలో సీఎంతో త‌మ గోడు విన్న‌వించుకునేందుకు ఎమ్మెల్యేలు వ‌చ్చినా..అప్పాయింట్‌మెంట్ ఇప్పించ‌డం లేదు. పైగా ఎప్పుడూ నిధులు నిధులు అంటారు నొక్కేయ‌డానికా? సీఎంకు అన్నీ తెలుసు.. అంటూ.. అవ‌మాన‌క‌ర‌రీతిలో మాట్లాడుతున్నార‌ని ఎమ్మెల్యేలు కూడా వాపోతున్నారు.

ఇవ‌న్నీ.. బ‌హిరంగ ర‌హ‌స్యాలే! కానీ.. ఎవ‌రూ పైకి చెప్ప‌రు. కొంద‌రు బ‌య‌ట ప‌డితే.. వారికి చెక్ ప‌డుతోంది. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ నేత‌లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ షాడో మంత్రితో వేగ‌లేక‌పోతున్నామంటూ.. సోష‌ల్ మీడియాలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితి మారుతుందా? లేక ఇదే కొన‌సాగుతుందా చూడాలి. ఇదే కొన‌సాగితే.. ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.