మంత్రి వెల్లంపల్లికి సీరియస్

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు సీరియస్ గా ఉంది. అందుకే అర్జంటుగా విజయవాడ నుండి హైదరాబాద్ లోని అపోలో ఆసుప్రతికి తరలించారు. దాదాపు 15 రోజులుగా వెల్లంపల్లి కరోనా వైరస్ కు చికిత్స చేయించుకుంటున్నారు. అయితే ఆరోగ్య పరిస్ధితిలో ఎటువంటి డెవలప్మెంట్ కనబడలేదని సమాచారం. పురోగతి కనబడకపోగా మరింత క్షీణించినట్లు డాక్టర్లు గుర్తించారు. దాంతో విజయవాడలో లాభం లేదనుకున్న డాక్టర్లు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో మంత్రిని హైదరాబాద్ కు తరలించారు.

ఆమధ్య తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మంత్రి చాలా చురుగ్గా పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజున జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ కార్యక్రమంలో మంత్రి ముఖ్యమంత్రితోనే ఉన్నారు. తర్వాత విజయవాడకు తిరిగివచ్చిన తర్వాత జ్వరం రావటంతో పరీక్షలు చేయించుంటే వెల్లంపల్లికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అప్పటి నుండి మంత్రి దాదాపు విశ్రాంతిలోనే ఉండిపోయారు. ఇదే సమయంలో బ్రహ్మోత్సవాల్లో మంత్రితో పాటు పాల్గొన్న మరో సహచర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణతో పాటు మరికొందరు ఎంఎల్ఏలకు, ఉన్నతాధికారులకు కూడా తర్వాత కరోనా వైరస్ సోకినట్లు వార్తలొచ్చాయి.

మధ్యలో వెల్లంపల్లి కోలుకుని జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే తనకు కరోనా తగ్గిపోయిందన్న కారణంతోనే మంత్రి విజయవాడలో ఇష్టం వచ్చినట్లు తిరిగేశారు. ఏమైందో ఏమో మంగళవారం జ్వరం పెరిగిపోయిందట. దాంతో ఇంట్లోనే ఉండి మందులు తీసుకున్నారు. అయితే బుధవారం సాయంత్రానికి ఆరోగ్యం బాగా క్షీణించింటంలో ఆసుపత్రిలో చేర్చారు. రెండోసారి వెల్లంపల్లికి కరోనా సోకిందనే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. సరే రక్తపరీక్షలను చేయించారు. అయితే సాయంత్రానికి సీరియస్ అయ్యింది. దాంతో విజయవాడలో లాభం లేదనుకుని వెంటనే విమానంలో హైదారాబాద్ కు తరలించారు.

తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి కూడా కరోనా వైరస్ భారినపడి చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. కొందరు ఎంఎల్ఏలు, మంత్రి చెల్లుబోయిన తదితరులు కొద్దిరోజులకే కోలుకున్నారు. కానీ వెల్లంపల్లి మాత్రం అనారోగ్యంతో ఇబ్బందులు పడుతునే ఉన్నారు. చివరకు బుధవారం ఆసుపత్రిలో చేరాల్సొచ్చింది. మరి ఇన్ని రోజులుగా మంత్రికి సంబంధిచింన విషయం ఏదీ బయటకు రాలేదు. కానీ హఠాత్తుగా వెల్లంపల్లిని విజయవాడ నుండి విమానంలో హైదరాబాద్ తరలించటం ఆశ్చర్యంగా ఉంది.

మంత్రి ఆరోగ్య పరిస్దితి నిలకడగానే ఉందని చెబుతున్న డాక్టర్లు మరి హైదరాబాద్ కు ఎందుకు తరలించారనే ప్రశ్నకు సమాధానం చెప్పటం లేదు. మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉంటే విజయవాడ ఆసుపత్రిలోనే ఉంచచ్చు కదా ? భారీ వర్షాల కారణంగా రోడ్డు మార్గం సరిగా లేకపోవటంతో విమానంలో హైదారబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. హుటాహుటిన మంత్రిని హైదరాబాద్ కు తరలించటంతోనే ఆరోగ్య పరిస్ధితిపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.