బాబుకు త‌ల‌నొప్పులు వారి నుంచే.. కానీ, మార్చే ప‌రిస్థితి లేద‌ట‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబును ద‌గ్గ‌ర‌గా చూసిన వారు.. ఒక మాట చెబుతారు. ఆయ‌న అతి మొహ‌మాట‌స్తుడ‌ని, న‌మ్మితే.. ఎంత‌టి వారినైనా నెత్తిన పెట్టుకుంటార‌ని, అదేస‌మ‌యంలో అలాంటివారు ఎన్ని త‌ప్పులు చేసినా.. చివ‌ర‌కు త‌న కాళ్ల‌కింద‌కే నీళ్లు వ‌చ్చేలా చేసినా.. స‌హిస్తార‌ని.. అంటారు. బ‌హుశ .. ఇది నిజం కావొచ్చు! ఎందుకంటే.. చంద్ర‌బాబు న‌మ్మిన‌వారు.. ఆయ‌న నెత్తిన పెట్టుకున్న‌వారు చాలా మంది.. త‌ల‌నొప్పిగా మారారు. పార్టీలోను, నియోజ‌క‌వ‌ర్గంలోనూ వారి వ‌ల్ల వివాదాలే త‌ప్ప చంద్ర‌బాబుకు వ‌చ్చిన ప్ర‌యోజ‌నం ఏమీ లేదు. ఇలాంటి స‌మ‌యంలో అలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకుని లేదా వారిని ప‌క్క‌న పెట్టి బాబు ముందుకు వెళ్లే చాన్స్ ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న అలా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు.

దీంతో పార్టీ ప్ర‌యోజ‌నాలు పూర్తిగా దెబ్బ‌తింటున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉదాహ‌ర‌ణ‌కు.. నెల్లూరు నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. ఈయ‌న ఐదుసార్లుగా ఓడిపోతున్నారు. పైగా పార్టీని బ‌లోపేతం చేయ‌లేక‌పోతున్నారు. త‌న రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని కూడా ఆయ‌న పార్టీలో నిల‌బెట్ట‌లేక పోతున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌క గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి ప‌లువురు కీల‌క రెడ్డి నాయ‌కులు బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలిసి కూడా సోమిరెడ్డిపై ఉన్న వాత్స‌ల్యంతో ఆయ‌న‌ను ఏమీ అన‌లేక పోతున్నారు. ఇక‌, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు. ఈయ‌న పార్టీలో ఉన్నా.. పార్టీ ప్ర‌యోజ‌నాల క‌న్నా స్వ‌ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద‌పీట వేసుకున్నార‌నేది సీనియ‌ర్ల మాట‌.

మైనింగ్ ఆరోప‌ణ‌లు కూడా య‌ర‌ప‌తినేని ఉన్నాయి. సీబీఐ కూడా కేసు న‌మోదు చేసింది. పైగా గ‌త ఏడాది ఆయ‌న‌పై వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌తో పార్టీపూర్తిగా న‌ష్ట‌పోయింది. ఇప్ప‌టికీ .. ఆయ‌న దూకుడు త‌గ్గ‌లేదు. అయినా.. చంద్ర‌బాబు మౌనం పాటిస్తున్నార‌ట‌. సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు.. అనే ప్రేమ‌తోనేన‌ని అంటున్నారు పార్టీ నేత‌లు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నేత చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌. పార్టీని ఎంత బ‌జారుకు ఈడ్చాలో అంతా ఈడ్చేశార‌ని.. ఆయ‌న పై ఇప్ప‌టికీ సీనియ‌ర్లు చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. త‌ర్వాత కూడా ఈయ‌న వివాదంగానే వ్య‌వ‌హ‌రించారు.

అయినా.. చంద్ర‌బాబు మార్చే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదని చెప్పుకొంటున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయ‌కులు పార్టీలోనే ఉండి.. పార్టీ కోసం కాకుండా త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మార్థంగా ముందుకు సాగుతున్నా చంద్ర‌బాబు మౌనం వ‌హిస్తున్నార‌ని, ఇది పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లిగిస్తోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికైనా పార్టీని బాగు చేయాల‌ని అనుకుంటే.. మొహ‌మాటాల‌ను ప‌క్క‌న పెట్టి ప‌నిచేసేవారిని ప్రోత్స‌హించాల‌ని సీనియ‌ర్లు కోరుతున్నారు. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.