ఈ మాజీ మంత్రిది ఒంటరి పోరాటమేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెలుగుదేశంపార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షునిగా కొవ్వూరు మాజీ ఎంఎల్ఏ, మాజీమంత్రి జవహార్ నియమించిన విషయం అందరికీ తెలిసిందే. చాలా కాలంగా జవహర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బలమైన వర్గం ఇంకా వ్యతిరేకిస్తున్న కారణంగా మాజీ మంత్రి ఒంటరైపోయారు. నియోజకవర్గాల పునర్ విభజనలో భాగంగా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారింది.

టీచర్ గా పనిచేస్తున్న జవహర్ 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరి ఎంఎల్ఏ గా పోటిచేసి గెలిచారు. అదే ఊపులో మంత్రి కూడా అయిపోయారు. అప్పటి వరకు నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయిస్తున్న బలమైన వర్గానికి జవహర్ కు చెడింది. ఎంఎల్ఏగా ఉన్నంత వరకు సంబంధాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే జవహర్ మంత్రయ్యారో అప్పటి నుండి స్వతంత్రంగా వ్యవహరించటంలో బలమైన వర్గంలోని నేతలకు మండిపోయింది. దాంతో మంత్రికి వ్యతిరేకవర్గం నేతలకు బాగా చెడింది.

జవహర్ మంత్రిగా ఉన్నా నియోజకవర్గంలో పోటి కార్యక్రమాలను వ్యతిరేక వర్గం నిర్వహిస్తునే ఉంది. 2019 ఎన్నికల్లో జవహర్ కొవ్వూరులో పోటి చేసినా గెలిచే పరిస్ధితి లేకపోవటంతో కృష్ణా జిల్లాలోని తిరువూరుకు మార్చారు. విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం ఎంఎల్ఏ వంగలపూడి అనితను కొవ్వూరుకు చంద్రబాబునాయుడు షిఫ్ట్ చేశారు. అయితే ఇటు అనిత అటు జవహర్ ఇద్దరూ ఓడిపోయారు. దానికితోడు పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో మళ్ళీ ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళు వెళ్ళిపోయారు.

ఎటూ పార్టీతో పాటు జవహర్ కూడా ఓడిపోయారు కాబట్టి ఇక నియోజకవర్గంలో గొడవలుండవని అనుకున్నారు. అయితే మాజీమంత్రికి రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షునిగా నియమించబోతున్న విషయం బయటకు వచ్చింది. దాంతో వ్యతిరేక వర్గం మళ్ళీ యాక్టివ్ అయి జవహర్ ను అధ్యక్షునిగా నియమించకూడదంటూ నేతలతో తీర్మానం చేయించి చంద్రబాబుకు ఇచ్చారు. అయితే ఇంతమంది చెప్పినా వినకుండా చంద్రబాబు మాత్రం మాజీమంత్రినే అధ్యక్షునిగా నియమించారు. దాంతో మాజీమంత్రికి మళ్ళీ బలమైన వర్గం నుండి వ్యతిరేకత మొదలైంది.

పార్టీ కార్యక్రమాల్లో దేనిలో కూడా జవహర్ కు వ్యతిరేకవర్గం సహకరించటం లేదని సమాచారం. మరి బలమైన వ్యతిరేకవర్గంను కాదని మాజీమంత్రి ఎన్నిరోజులు పార్టీ కార్యక్రమాలు నిర్వహించగలరు ? అన్నదే ఇఫుడు టాక్ ఆఫ్ ది నియోజకవర్గం అయ్యింది. మాజీమంత్రికి ఇంతటి బలమైన వ్యతిరేకవర్గం ఉందని తెలిసినా సయోధ్యం చేసే విషయంలో చంద్రబాబు ఎందుకు ప్రయత్నించటం లేదో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. జవహర్ చెప్పేది వింటున్నారు. అటు వ్యతిరేకవర్గంతోను సమావేశం అవుతున్నారు. దాంతో నియోజకవర్గంపై చంద్రబాబు మనసులో ఏముందో అర్ధంకాక అందరు అయోమయంలో ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా నేతల మధ్య ఇన్ని విభేదాలుంటే పార్టీ ఎలా బలోపేతమవుతుందో ఏమో.