‘దొనకొండ‘ బంగారు కొండ కానుందా?

రాష్ట్రంలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో ఒకటైన పల్నాడు ప్రాంతంలోని దొనకొండ పేరు కొద్ది సంవత్సరాల క్రితం వార్తల్లో ప్రముఖంగా వినిపించింది. ప్రభుత్వ భూములు, అటవీ భూములు కలిపి…దాదాపు 50 వేల ఎకరాలు భూములున్న ఈ ప్రాంతంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కాబోతోందని గత ప్రభుత్వం హయాంలో విపరీతమైన ప్రచారం జరిగింది.

దీంతో, దొనకొండ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో విస్తారంగా అటవీ, ప్రభుత్వ భూములు ఉన్న ఈ ప్రాంతం రాజధాని అవుతుందనుకొని భూములు కొన్నవారు….ఆ తర్వాత రాజధాని అమరావతికి తరలిపోవడంతో అందినకాడికి కొన్న భూములను అమ్ముకున్నారు. ఇక మూడు రాజధానుల నేపథ్యంలో దొనకొండ పేరు కనుమరుగైంది.

ఈ నేపథ్యంలో ఆ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. రాజధానిగా ప్రచారం జరిగిన దొనకొండ….పారిశ్రామిక కారిడార్ గా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే దొనకొండలో నేవీ, డిఫెన్స్, సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు చర్చలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. అయితే, ప్రస్తుతం దొనకొండలో నేవీ, డిఫెన్స్‌ కేంద్రాల ఏర్పాటు, సోలార్‌ ప్రాజెక్టుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంతోపాటు జాతీయస్థాయి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలుస్తోంది.

రైతులకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు దొనకొండలో 1000 మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందు కోసం సుమారు 5 వేల ఎకరాల భూమిని సర్వేచేసి నివేదికను కూడా అధికారులు తయారుచేసినట్టు తెలుస్తోంది. దొనకొండలోని రుద్రసముద్రం, భూమనపల్లి, మంగినపూడి ప్రాంతాల్లోని పలు సర్వే నంబర్లకు సంబంధించిన భూమిని గుర్తించినట్లు తెలుస్తోంది. 4 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు ఏడాదిలోనే పూర్తి చేసి మరో ఏడాది నాటికి విద్యుదుత్పత్తి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనుండడంతో దొనకొండ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.