జూపూడికి కీల‌క ప‌గ్గాలు.. వైసీపీలో చ‌ర్చ‌!

ఎస్సీ నాయ‌కుడు, మాల మ‌హానాడు నేత‌, జూపూడి ప్ర‌భాక‌ర్‌కు మ‌ళ్లీ ద‌శ తిర‌గ‌నుందా? ఆయ‌న‌కు మ‌ళ్లీ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు వైసీపీ అధిష్టానం దృష్టిపెట్టిందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న జూపూడి.. 2014లో ప్ర‌కాశం జిల్లా కొండ‌పి నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే, ఆయ‌న వివిధ కార‌ణాల‌తో ఓడిపోయారు. ముఖ్యంగా వైసీపీలోని ఓ వ‌ర్గం ఆయ‌న‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. దీంతో గెలుపు అంచుల వ‌ర‌కు వ‌చ్చి..కూడా ఆయ‌న గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు.

ఆ త‌ర్వాత ప‌రిణామాల‌తో జూపూడి టీడీపీలోకి జంప్ చేశారు. అక్క‌డ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌మ‌ని కోరినా.. చంద్ర‌బాబు ఇవ్వ‌క‌పోవ‌డంతో అలిగి.. మ‌ళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వీ లేదు. హైద‌రాబాద్‌లో ఉంటున్నార‌ని తెలిసింది. అయితే, ఆయ‌న‌కు త్వ‌ర‌లోనే తిరిగి కొండ‌పి ఇంచార్జిగా బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు అధిష్టానం ప‌రిశీలిస్తోంద‌ని తెలుస్తోంది. ఇక్క‌డ ప్ర‌స్తుతం డాక్ట‌ర్ మాదాసు వెంక‌య్య పార్టీ ఇంచార్జ్‌గా ఉన్నారు. అదేస‌మ‌యంలో ఆయ‌న స్థానిక కోఆపరేటివ్ సెంట్ర‌ల్ బ్యాంకు చైర్ పర్సన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. కొండ‌పి వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న అశోక్‌కుమార్ త‌మ‌కు న్యాయం చేయడం లేద‌ని, త‌మ వ‌ర్గాన్ని ప‌క్క‌న పెట్టార‌ని ఆరోపించిన ఇక్క‌డి నాయ‌కులు రెండు గ్రూపులుగా విడిపోయారు. దీంతో ఆయ‌న‌ను త‌ప్పించిన వైసీపీ.. ఎన్నిక‌ల‌కు మూడు వారాల ముందు మాదాసు వెంక‌య్య‌ను రంగంలోకి దింపింది. అయితే, ఆయ‌న కూడా గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయినా పార్టీని నిల‌బెట్టాల‌ని.. ఇక్క‌డ నాయ‌కుల‌ను ఏక‌తాటిపై న‌డిపించాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు. కానీ, ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌లేక పోతున్నార‌నే విమ‌ర్శ‌లు గ‌డిచిన కొంత కాలంగా వినిపిస్తున్నాయి. దీనికితోడు.. ఆయ‌న‌పై ఫిర్యాదులు కూడా పెరిగిపోయాయి.

కీల‌క‌మైన ఎస్సీ సామాజిక వ‌ర్గం వారికే మాదాసు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని, త‌మ వారిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పేర్కొంటూ.. రెడ్డి సామాజిక వ‌ర్గం నాయ‌కులు గుస్సాగా ఉన్నారు. దీంతో వ‌ర్గాలుగా ఏర్ప‌డి.. మాదాసును త‌ప్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం దీనిపై దృష్టి పెట్టిన అధిష్టానం.. మ‌ళ్లీ ఇక్క‌డ జూపూడికి ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు వైసీపీలోనే చ‌ర్చ సాగుతోంది. ఆయ‌నైతే.. అంద‌రినీ క‌లుపుకొని వెళ్తార‌ని, 2014లో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితులు వేర‌ని.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు మూడేళ్ల గ‌డువు ఉంది .. క‌నుక ఆయ‌నకు అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.