తెలుగు.. త‌ప్ప‌దు.. రాజ‌కీయంగా వాడేద్దాం.. వైసీపీలో చ‌ర్చ‌

రాష్ట్రంలో అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టారు. కొన్నింటిని అమ‌లు చేస్తున్నారు. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు తీసుకువ‌చ్చారు. దాదాపు అన్నీ అమ‌ల‌వుతున్నాయి. కానీ, కీల‌క‌మైన రెండు ప‌థ‌కాలు.. మాత్రం ముందుకు వెన‌క్కు గుంజుతున్నాయి. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న‌.. వైసీపీ నేత‌ల‌ను ద‌హిస్తోంది. ఆ రెండు ప‌థ‌కాల్లో ఒక‌టి పేద‌ల‌కు ఇళ్ల పంపిణీ, రెండు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో.. తెలుగు మీడియాన్ని ఎత్తేసి ఇంగ్లీష్ మీడియంను అమ‌లు చేయ‌డం. ఈ రెండు ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తే.. ఇక తిరుగు ఉండ‌ద‌నేది వైసీపీ వ్యూహం. ఈ రెండు కూడా ఓటు బ్యాంకుతో ముడి ప‌డిన ప‌థ‌కాలు కావ‌డం గ‌మ‌నార్హం.

బ‌హుశ అందుకేనేమో.. టీడీపీ నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చింది. పేద‌ల‌కు ఇళ్ల విష‌యంలో ప్ర‌త్య‌క్షంగా ఆందోళ‌న చేయ‌క‌పోయినా.. తెలుగు మీడియంపై మాత్రం ఇంటా బ‌య‌టా పోరును తీవ్రం చేశారు.. చంద్ర‌బాబు. నేడో రేపో.. మ‌రో రోజైనా.. పేద‌ల‌కు ఇళ్ల ప‌థ‌కం ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంది. లేదా కోర్టు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న 4 వేల ఎక‌రాల విష‌యాన్ని ప‌క్క‌న పెట్టినా.. దానిని అమ‌లు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ, ఎటొచ్చీ.. అత్యంత కీల‌క‌మైన తెలుగు మీడియం స్థానంలో ఆంగ్ల మాధ్య‌మ ప్ర‌వేశం విష‌యంలో మాత్రం వైసీపీకి ఇబ్బందులే క‌నిపిస్తున్నాయి.

దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ అంగీక‌రించేది లేద‌ని.. మాతృభాష‌లోనే విద్యాబోధ‌న సాగాల‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. జీవోల‌ను కూడా కొట్టి వేసింది. దీంతో ప్ర‌భుత్వం సుప్రీం త‌లుపు త‌ట్టింది. తీర్పు రాలేదు కానీ, తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో సుప్రీం కూడా తెలుగు మాధ్య‌మం(మాతృభాష‌కే) వైపే మొగ్గు చూపింది. రేపు తీర్పులోనూ ఇదే వ‌చ్చే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక‌, ఇలా తీర్పు వ‌స్తే.. ప్ర‌భుత్వం ముందుకు వెళ్లే అవ‌కాశం లేదు. మ‌రి ఏం చేయాలి? ఇంగ్లీష్ మీడియం కావాలంటూ 96 శాతం మంది త‌ల్లిదండ్రులు కోరార‌ని ప్ర‌భుత్వం చెప్పినా.. సుప్రీం ఒప్పుకోలేదు. సో.. దీనిని ఎలా చూడాలి..? ఇదీ ఇప్పుడు వైసీపీ నేత‌లు చేస్తున్న ఆలోచ‌న‌.

ఈ క్ర‌మంలో దీనిని కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ వ్యూహం సిద్ధం చేస్తోంది. త‌దుప‌రి విచార‌ణ‌లో సుప్రీం తీర్పు ఆంగ్ల మాధ్య‌మానికి వ్య‌తిరేకంగా వ‌స్తే.. దీనిని రాజ‌కీయంగా మార్చి.. టీడీపీపై పైచేయి సాధించాల‌ని తాజాగా నిర్ణ‌యించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల క‌థ‌నం. అంటే.. మేం చేయాల‌నుకున్నాం..కానీ, బాబు ఆయ‌న‌త‌మ్ముళ్లు న్యాయ పోరాటం అంటూ.. పేద‌ల‌కు ఇంగ్లీష్ చ‌దువును దూరం చేశార‌నే ప్ర‌చారం విస్తృతం చేయాల‌ని.. ఈ విష‌యంలో న్యాయ‌వ్య‌వ‌స్త‌ను త‌ప్పుప‌ట్ట‌కుండా.. కేవ‌లం రాజ‌కీయంగా వాడుకోవాల‌ని.. భావిస్తున్నారు. మ‌రి దీనిని ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.