పదే పదే టీడీపీకి టార్గెట్ అవుతున్న గుమ్మనూరు

పదే పదే తెలుగుదేశంపార్టీ నేతలకు కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు ? మంత్రిపై అవినీతి ఆరోపణలతో వరుసగా రెండోసారి కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొదటేమో ఇఎస్ఐ కుంభకోణంలో ఏ 14 నిందితుడైన కార్తీక్ అనే వ్యక్తినుండి బహుమానంగా బెంజికారును తీసుకున్నారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఇపుడేమో కర్నూలు జిల్లాలోని ఆస్పిరి మండలంలో 203 ఎకరాలను కుటుంబసభ్యులు, బినామీల పేర్లపై కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు మొదలుపెట్టారు.

రెండు ఆరోపణలపైనా చింతకాయల పెద్దగా ఆధారాలను చూపించింది లేదు. బెంజికారును బహుమతిగా తీసుకున్నారనేందుకు కారు ముందు ఫొటోలు దిగటాన్ని, కారులో కూర్చున్నపుడు దిగిన ఫొటోలే ఆధారాలంటు చింతకాయల చెప్పారు. కారుముందు ఫొటోలు దిగితే ఆ కారు ఫొటోలు దిగిన వాళ్ళది అయిపోతుందా ? అంటూ మంత్రి ఎదురుదాడి చేశారు. కొత్త కారు కొన్న సమయంలో కారుకు కట్టిన రిబ్బన్ కత్తిరించమని కార్తీక్ అడిగితే తన కొడుకు సరే అన్నాడని మంత్రి బదులిచ్చారు. ఆ సమయంలో కార్తీక్ తో కలిసి తన కొడుకు కొన్ని ఫొటోలు దిగటం తప్పా అంటు ప్రశ్నించారు మంత్రి.

సరే మంత్రి చెప్పినట్లుగా కారు ముందు నిలబడి, కారులో కూర్చుని ఫొటోలు దిగటం తప్పు కాదు. కానీ కుంభకోణంలో ఏ 14 నిందితుడైన వ్యక్తితో దూరంగా ఉండాలన్న కనీస ఇంగితం కూడా మంత్రికి లేకపోతే ఎలా ? ఒకవైపు కుంభకోణంపై ఏసీబీ ఉన్నతాధికారులు విచారణ జరుపుతుంటే మరోవైపు నిందితులతో కలిసి స్వయంగా మంత్రి కొడుకే ఫొటోలు దిగితే ఉన్నతాధికారులకు ఏమని సిగ్నల్ వెళుతుందో మంత్రికి అంతమాత్రం తెలీదా ?

ఇక తాజా ఆరోపణలను తీసుకుంటే చింతకాయల ఆరోపణలన్నీ తప్పంటూ మంత్రి చెప్పారు. తాను భూములను న్యాయబద్దంగానే కొన్నట్లు జయరామ్ వివరించారు. తాను కొనుగోలు చేసింది 100 ఎకరాలైతే చింతకాలయ 203 ఎకరాలు కొన్నట్లు ఎలా చెబుతారంటూ ఎదురు దాడి మొదలుపెట్టరు. తాను ఎవరి భూములను ఆక్రమించుకోలేదని, అన్యాయంగా ఎవరి దగ్గరా కొనలేదని మంత్రి చెప్పినా ఎవరు నమ్ముతారు ? కొనుగోలు చేసింది వాస్తవమా కాదా అన్నదే ప్రశ్న.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కర్నూలు మంత్రిపై విశాఖపట్నంకు చెందిన మాజీమంత్రి ఆరోపణలు చేయటం. మామూలుగా ఏ జిల్లా మంత్రిపై ఆ జిల్లా వాళ్ళకే సమాచారం తెలుస్తుంటుంది. మరి ఎక్కడో వైజాగ్ లో ఉండే చింతకాయలకు కర్నూలులో మంత్రి కొన్న భూముల వివరాలు ఎలా తెలిసింది ? అంటే ఎవరో వ్యూహాత్మకంగా మంత్రి వివరాలను చింతకాయలకు చేరవేసి ఆయన ద్వారా ఆరోపణలు చేయిస్తున్నారు. మంత్రి వివరాలు ఉప్పందిస్తున్న వారు టీడీపీ నేతలు అయ్యుండచ్చు లేదా వైసిపిలోనే జయరాం అంటే పడని వ్యక్తులూ అయ్యుండచ్చు.

ఏదేమైనా మంత్రి మాత్రం పదే పదే టీడీపీకి టార్గెట్ గా మారుతున్నారన్నది మాత్రం వాస్తవం. ఒకవైపు అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉంటున్నారు. మంత్రివర్గంలోని మరేమంత్రిపైనా లేనంతగా ఒక్క జయరామ్ మీద మాత్రమే అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. కాబట్టి మంత్రివర్గంలో జయరామ్ ఎంతకాలం ఉంటారన్నది అనుమానంగా మారింది. చూద్దాం తాజా ఆరోపణలపై జగన్ ఏమంటారో ?