ఇకపై ఏపీలో ఒకటో తరగతి నుంచే సెమిస్టర్ విధానం

తన హయాంలో ‘నాడు-నేడు’ ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తానని, ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధనతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని ఏపీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, 1-5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని కేంద్రం నూతన విద్యా పాలసీని తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే 6వ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధన చేయాలన్న యోచనలో జగన్ సర్కార్ ఉంది. మరోవైపు, నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఏపీ సర్కార్ మరిన్ని మార్పులు చేర్పులు చేపట్టింది.

అందులో భాగంగానే దేశంలో తొలిసారిగా 1వతరగతి నుంచే ఏపీలో సెమిస్టర్ విద్యావిధానాన్ని ఏపీ సర్కార్ ప్రవేశపెట్టనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టనున్న ఈ విధానానికి తగినట్లుగానే పాఠ్య పుస్తకాలను 3 సెమిస్టర్‌లలాగా విభజించారు. ఒక పేజిలో తెలుగులో… మరో పేజీలో ఇంగ్లీష్‌లో ముద్రించడం ద్వారా ఇంగ్లీష్ బోధన అర్దమయ్యే రీతిలో పుస్తకాలు రూపొందించింది

దీంతోపాటు, ఏపీలో తొలిసారిగా విధ్యార్ధులకు వర్క్ బుక్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు.టీచర్స్ కి, తల్లితండ్రులకి‌ కూడా హేండ్ బుక్స్ ఇవ్వనున్నారు. విధ్యార్దుల దృష్టిని ఆకర్షించేలా రంగురంగుల బొమ్మలతో పాఠ్య పుస్తకాల రూపొందించారు. మార్చి నెలాఖరునాటుకి హైస్కూళ్లకి.. జూన్ నాటికి ప్రాదమిక పాఠశాలలకి పాఠ్యపుస్తకాలని పంపిణీ చేశామని విద్యాశాఖాధికారులు తెలిపారు. దీంతోపాటు, నూతన సిలబస్ ను కూడా తీసుకురానుంది. సిలబస్ లో మార్పుల కోసం రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్ధ అమెరికా, ఆస్డ్రేలియా లాంటి 10 దేశాల ప్రాధమిక విద్యావిధానాలపై, దేశంలోని 15 రాష్ట్రాల ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్ పై అధ్యయనం చేసింది.

ఒకటి నుంచి ఆరో తరగతి వరకు నూతన విద్యావిధానం ద్వారా మార్పులు తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం 84 రకాల పాఠ్య పుస్తకాలు, 63 వర్క్ బుక్‌లను రూపొందించడంతో పాటు తమిళం, ఒరియా, కన్నడ, ఉర్ధూ మీడియంలలో పాఠ్య పుస్తకాలు ముద్రించింది. కొత్త సిలబస్ ప్రకారం ఒకటి, రెండు తరగతులకి తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు.. మూడు, నాలుగు, అయిదు తరగతులకు తెలుగు, ఇంగ్లీష్, మేథ్స్‌, సైన్స్ పాఠ్య పుస్తకాలు ఉంటాయి. ఆరో తరగతి విధ్యార్ధులకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాలగా ఉండబోతున్నాయి.