అర్ధరాత్రి అంత్యక్రియులకు కారణమిదే..

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో అమ్మాయికి సంబంధించిన విషాదాంతం దేశాన్ని కుదిపిస్తోంది. నిర్భయ ఘటన తర్వాత అంతగా చర్చనీయాంశమవుతున్న ఉదంతమిది. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిపి, తీవ్రంగా గాయపరచడంతో ఆమె చనిపోయినట్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

తమ కూతురి విషయంలో జరిగిన దారుణానికి ఆ కుటుంబం ఎంతగా తల్లడిల్లుతూ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఆ బాధ చాలదన్నట్లు ఆ అమ్మాయిని చివరి చూపు చూపించకుండా, కుటుంబ సభ్యులు లేకుండానే అర్ధరాత్రి దాటాక పోలీసులే అంత్యక్రియలు జరిపించేయడం తీవ్ర విమర్శల పాలైంది. ఆ కుటుంబం బాధను రెట్టింపు చేసే పరిణామం ఇది. ఇలా చేయడంలో పోలీసుల ఉద్దేశమేంటన్నది అర్థం కాలేదు.

ఐతే ఈ కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో ప్రభుత్వం.. అర్ధరాత్రి దాటాక అలా అంత్యక్రియలు జరపడానికి దారి తీసిన కారణాలేంటో వివరించింది. సెప్టెంబర్ 29న సఫ్తర్ జంగ్ ఆసుపత్రి వద్ద ధర్నా జరిగిన తీరు చూశాక.. మొత్తం ఘటనను కుల, మత పరమైన రంగు పులిమే ప్రమాదం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నుంచి తమకు సమాచారం అందిందని.. బాధితురాలి గ్రామంలో పగటి పూట అంత్యక్రియలు జరిపితే కల్లోల పరిస్థితులు నెలకొనేందుకు ఆస్కారం ఉందని అర్థమై జిల్లా యంత్రాంగం రాత్రికి రాత్రి అంత్యక్రియలు పూర్తి చేయాలనే అసాధారణ నిర్ణయానికి వచ్చినట్లు యూపీ సర్కారు సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

రెండు కులాలకు చెందిన వ్యక్తులతో కలిసి వివిధ రాజకీయల పార్టీల నేతలు, కార్యకర్తలు, మీడియా సిబ్బంది సహా వేలాది మంది మరుసటి రోజు ఉదయం గ్రామానికి చేరనున్నారనే నిర్దిష్ట సమాచారం అందిందని.. హింస చెలరేగకుండా ఉండేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి రాత్రికి రాత్రి అంత్యక్రియలు నిర్వహించామని పేర్కొంది. బాధితురాలి కుటుంబ సభ్యులు లేకుండా, వారికి తెలియకుండానే అంత్యక్రియలు జరిగినట్లుగా మీడియాలో వార్తలు రాగా.. యూపీ సర్కారు మాత్రం బాధితురాలి కుటుంబ సభ్యుల సమ్మతితో, వారి సమక్షంలోనే అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆ అఫిడవిట్‌లో తెలిపింది.