హథ్రస్ అల్లర్ల వెనుక అంతర్జాతీయ కుట్ర ?

ఉత్తర ప్రదేశ్ లోని హథ్రస్ జిల్లాలో జరిగిన అల్లర్ల వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందా ? అవుననే అంటున్నారు యూపీ పోలీసులు. ఓ దళిత యువతిపై నలుగురు యువకులు హత్యాచారం చేసిన విషయం (యూపీ పోలీసులు దాడి అని మాత్రమే అంటున్నారు) అందరికీ తెలిసిందే. ఘటన తర్వాత పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా రాజకీయ పార్టీలతో నేరుగానే ఢీ కొన్న విషయం అందరు చూసిందే.

బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన కాంగ్రెస్ అగ్రనేతల రాహూల్ గాంధి, ప్రియాంకా గాంధిల విషయంలో పోలీసులు ప్రవర్తించిన విధానంతో ఘటనకు ఒక్కసారిగా రాజకీయ యాంగిల్ కూడా తోడయ్యింది. రాహూల్ గాంధిని పోలీసులు రోడ్డుపై పడేసిన ఘటనతో దేశం దృష్టి యావత్ హథ్రస్ పై ఫోకస్ అయ్యింది.

వివిధ కారణాల వల్ల హత్యాచారం ఘటన అనేక మలుపులు తిరిగింది. దీని ఫలితంగా ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి బాగా చెడ్డపేరొచ్చింది. ఇందులో నుండి బయటపడటంలో భాగంగా అల్లర్ల వెనుక అంతర్జాతీయ కుట్ర జరిగిందంటు పోలీసులు కొత్త పల్లవి అందుకున్నారు. హత్యాచార ఘటనను అడ్డం పెట్టుకుని కుల, మత ప్రాతిపదికన పెద్ద స్ధాయిలో అల్లర్లకు ప్లాన్ జరిగిందని పోలీసులు చెప్పారు. యోగి సర్కార్ ను అంతర్జాతీయస్ధాయిలో అపఖ్యాతి పాల్జేసేందుకే కుట్ర మొదలైందని పోలీసులు గట్టి అభిప్రాయంతో ఉన్నారు.

జస్టిస్ ఫర్ హథ్రస్ విక్టిమ్. సిఏఆర్ఆర్డి.కామ్ అనే వెబ్ సైట్ ద్వారా నిర్వాహకులు అల్లర్లను ప్రేరిపిస్తున్నట్లు పోలీసులు బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ ను తాము నియంత్రించినట్లు కూడా పోలీసులు చెప్పారు. అమెరికాలో నల్లజాతీయులపై జరిగిన గొడవలను కూడా ఈ వెబ్ సైట్ లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే పేరుతో నిరసనలను బాగా హైలైట్ చేసి చూపించినట్లు పోలీసులు ప్రకటించారు. అమెరికాలో జరిగిన అల్లర్ల వెనుక కూడా ఈ వెబ్ సైటే కారణమని అక్కడి పోలీసులు గమనించిన విషయాన్ని యూపీ పోలీసులు బయటపెట్టారు.

విదేశీ నిధులతో నడిచే ఈ వెబ్ సైట్ నిర్వాహకులపై 19 కేసులను నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అందరిపైనా దేశద్రోహం కేసులు పెట్టినట్లు కూడా చెప్పటం గమనార్హం. మీడియాలోని చానళ్ళ లోగోలను, ప్రభుత్వ ప్రకటనలను మార్చేస్తు ఈ వెబ్ సైట్లో తప్పుడు సమాచారాన్ని బాగా ప్రచారం చేస్తున్న విషయాన్ని గుర్తించినట్లు పోలీసులు బయటపెట్టారు. మొత్తానికి అల్లర్ల వెనుక విదేశీకుట్ర ఉందని చెబుతున్న పోలీసులు హత్యాచారం ఘటన వెనుక ఎవరి హస్తం ఉందని తేల్చుతారో చూడాల్సిందే.