బాగా ఆలస్యమైపోయింది రాహుల్!

హాథ్‌రస్‌లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు, ఆమె మృతదేహాన్ని రాత్రికిరాత్రికి పోలీసులు దహనం చేసిన తరువాత యోగి ప్రభుత్వంపై ముందెన్నడూ లేనంత విమర్శలు వచ్చాయి. ఈ దేశంలో మోదీకి, యోగి ఆదిత్యనాథ్‌కు విమర్శలు కొత్తేమీ కానప్పటికీ ఈసారి రాహుల్ గాంధీకి కాస్త మైలేజ్ రావడం.. నిన్న రాహుల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కొద్ది నిమిషాలకే యోగి ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో రాహుల్ ప్రభావం కనిపించింది.

విమర్శకులను, తన వ్యతిరేకులను పూచికపుల్లలా తీసి పడేసే యోగి కూడా ఈసారి రాహుల్ హడావుడికి కాస్త బెండ్ అయినట్లు కనిపిస్తోంది. అయితే.. రాహుల్ ఎంత హడావుడి చేసినా ఆయన దిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నేతగానే ఇంకా కనిపిస్తున్నారు. అంతేకాదు… ఈ స్పీడు ఆయన కొనసాగిస్తారా అన్నది కూడా అనుమానమే. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే రాహుల్ యాక్టివ్ అవుతున్నారని.. అవి పూర్తయ్యాక మళ్లీ సుప్తావస్థలోకి వెళ్లిపోతారని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుతున్న పరిస్థితి.

అంతేకాదు.. రాహుల్ మిగతా అంశాలు, దేశంలోని మిగతా ప్రాంతాల విషయంలోనూ ఇంతే దూకుడుగా కదలాలన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఇటీవల కాలంలో దళితులపై దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయి. కలచివేసే ఘటనలు జరిగాయి. యూపీలో అత్యాచారం చిన్నవిషయం కాదు.. నిజమే.. కానీ, ఏపీలోనూ దళితులకు ఘోర అవమానాలు జరిగాయి. శిరో ముండనాలు జరిగాయి.. అత్యాచారాలు జరిగాయి.. దాడులు జరిగాయి.. డాక్టరైనా, జడ్జి అయినా కూడా దళితులు దాడులకు గురయ్యారు.

డాక్టర్ సుధాకర్, జడ్జి రామకృష్ణలకు ఏమైందో.. ఏమవుతుందో తెలిసిందే. విశాఖ, రాజమండ్రిలో దళితులకు శిరోముండనాలు చేశారు. మరి.. ఇవేమీ రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించలేదు. ప్రియాంకా గాంధీకి ఇవేమీ ఎందుకు పట్టలేదు. ఏపీలో పార్టీకి ఇప్పుడిప్పుడే అవకాశాలు లేవనా… లేదంటే ఎన్నికలేవీ ఇప్పట్లో లేవనా? లేదంటే అందరు ఉత్తరాది నాయకుల్లాగే దక్షిణాది అంటే చిన్నచూపా? రాహుల్, ప్రియాంకలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

హాథ్‌రస్ కేసుతో రాహుల్ గాంధీకి ఎంత మైలేజీ వచ్చినా కూడా ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది. రాహుల్ అనే నాయకుడిని సొంత పార్టీవారే లెక్క చేయని పరిస్థితి ఇప్పటికే వచ్చేసింది. ఇటీవల ఆ పార్టీ సీనియర్లు రాసిన లేఖే దానికి ఉదాహరణ. కరోనా వైరస్ లాక్‌డౌన్‌లో మోదీ వ్యతిరేక ఆర్థికవేత్తలను పెట్టుకుని జూమ్ ఇంటర్వ్యూలు చేసినా జనంలోకి వెళ్లలేదు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నా రాహుల్ ప్రకటనలకే పరిమితమవుతున్నారు కానీ కార్యక్షేత్రంలోకి రాలేకపోతున్నారు. హాథ్‌రస్ హడావుడితో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చినా ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.