ఫైర్ బ్రాండ్లు.. సైలెంట్‌.. టీడీపీలోనే ఎందుకిలా?

రాజ‌కీయాల‌న్నాక‌.. వివాదాల‌కు దూరంగా.. నిర్మాణాత్మ‌కంగా ఉండే రోజులు పోయాయి. ఇప్పుడంతా.. నువ్వు ఒక‌టంటే.. నేరెండెంటా? అనే నాయ‌కులు పెరిగిపోయారు. ప్ర‌జ‌ల్లో చాలా మంది కూడా ఇదే త‌ర‌హా రాజ‌కీయాల‌కు అల‌వాటు ప‌డ్డారు. ఫైర్ బ్రాండ్లు చేసే వ్యాఖ్య‌ల‌కు, వేసే కౌంట‌ర్ల‌కు సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి రాజ‌కీయ ప‌రిశీల‌కుల వ‌ర‌కు కూడా ఫాలోయింగ్ ఎక్కువ‌. ఆన్‌లైన్‌, యూట్యూబ్‌, సోష‌ల్ మీడియాల్లోనూ వీరికి రేటింగ్ ఎక్కువ‌. అందుకే.. ఎప్పుడు ఏ పార్టీలో అయినా ఫైర్ బ్రాండ్ మీడియా ముందుకు వ‌స్తే.. అన్ని పార్టీల్లోనూ ఆస‌క్తి ఉంటుంది.

వైసీపీని తీసుకుంటే.. కొడాలి నాని, రోజా, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, వంగా గీత‌, వైవీ సుబ్బారెడ్డి, ఆమంచి కృష్ణ‌మోహ‌న్.. ఇలా చాలా మంది ఉన్నారు. వీరు ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా.. పెద్ద సంచ‌ల‌నం. వారు ఏ కామెంట్ చేసినా.. వ్యూస్ అదిరిపోతుంటాయి. ఇలానే.. టీడీపీలోనూ కొంద‌రు ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌, పంచుమ‌ర్తి అనురాధ‌, స‌బ్బం హ‌రి, గంటా శ్రీనివాస‌రావు, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.., బోడే ప్ర‌సాద్‌, కేశినేని నాని, బీటెక్ ర‌వి, బుద్దా వెంక‌న్న‌.. ఇలా చాలా మంది ఉన్నారు.

వీరంతా టీడీపీ అంటే చెవులు, ముక్కు కూడా కోసేసుకుంటారు. ఇక‌, చంద్ర‌బాబుపై చిన్న‌పాటి మ‌చ్చ కూడా ప‌డ‌నివ్వ‌రు. అదేస‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డంలోను ముందున్నారు. జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌డంలోనూ ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డుతున్నారు. అయితే, ఇప్పుడు వీరికి చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పార్టీ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌ల‌ను నియ‌మించినా.. మ‌హిళా నేత‌ల‌కు అవ‌కాశం ఇచ్చినా.. ఫైర్ బ్రాండ్ నేత‌ల‌కు మాత్రం అవ‌కాశం ఇవ్వ‌క‌పోవడం గ‌మ‌నార్హం.

దీంతో అస‌లు పార్టీలో ఏమైంది? ఫైర్ బ్రాండ్ల‌తో ఇక‌, ప‌డ‌లేక వీరిని దూరం పెట్టారా? లేక‌.. వివాదాలు కొని తెచ్చుకోవ‌డం ఎందుక‌ని భావిస్తున్నారా? అనే కోణంలో త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతుండడం గ‌మ‌నార్హం. మ‌రి బాబు వ్యూహం ఏంటో చూడాలి. ఏదేమైనా.. ఒకింత దూకుడు కూడా పార్టీకి అవ‌స‌ర‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చంద్ర‌బాబు.