అటల్ టన్నెల్ వల్ల రాబోయే మార్పు ఏంటి?

ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రారంభించిన అటల్ టన్నెల్ వల్ల సైన్యానికి చాలా ఉపయోగాలున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ తంగ్ పాస్ వైపు నుండి మోడి సొరంగంలో ప్రయాణించారు. టన్నెల్ దక్షిణ ముఖద్వారం హిమాచల్ ప్రదేశ్ లో ఉంటే ఉత్తర ముఖద్వారం లడ్డాఖ్ లో ఉంది. ఈ రెండింటి మధ్య కొండలను తొలిచి 9.02 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించటంతో ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఇదే అతిపొడవైన టన్నెల్ గా రికార్డులోకి ఎక్కింది. సముద్ర మట్టానికి 10,340 అడుగుల ఎత్తున టన్నెల్ నిర్మాణం జరిగింది. బయటగాలి వేగం, ఆక్సిజన్ లెవల్స్ లాంటివి తెలిపే ఏర్పాట్లు కూడా టన్నెల్లో చేశారు. అలాగే కమ్యూనికేషన్ కోసం ప్రతి అర్ధ కిలోమీటర్ కు ఓ ల్యాండ్ ఫోన్ను కూడా ఏర్పాటు చేశారు. టన్నెల్ నిర్మాణం జరగకముందు పై రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం చేయాలంటే సైనికులతో పాటు మామూలు జనాలు కూడా నానా అవస్థలు పడేవారు.

ఇంతకుముందు రోహ్ తంగ్ పాస్-లడ్డాఖ్-లేహ్ మధ్య ప్రయాణించాలంటే కొండలను చుట్టుకుని, సరస్సులను దాటుకుని దాదాపు ఏడుగంటలు పట్టేది. అలాంటిది పై ప్రాంతాల మధ్య ఉన్న కొండలను తొలిచి అత్యంతాధునిక పరిజ్ఞాన్ని ఉపయోగించి టన్నెల్ ను నిర్మించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్వో) నిపుణులు ఈ టన్నెల్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. మొన్నటి వరకు పై ప్రాంతాల మధ్య ఉన్న రోడ్డులో ప్రయాణించాలంటే ఏడాది మొత్తం కేవలం నాలుగు నెలలు మాత్రమే సాధ్యమయ్యేది. శీతాకాలం వచ్చినా వర్షకాలంలోను పై రోడ్డును ప్రభుత్వం మూసేసేది. ఎందుకంటే శీతాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా మంచు తుఫానులు, విపరీతమైన మంచు కురవటంతో ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. అలాగే వర్షాకలంలో కూడా కొండచరియలు జారిపడటం వల్ల కూడా ప్రయాణం ప్రమాదకరంగా ఉండేది.

మామూలు జనాలైతే తమ ప్రయాణాలను వాయిదా వేసుకునే వారు. కానీ సైనికులకు అలా కుదరదు. పై రోడ్డు మార్గం సైనికావసరాలకు చాలా వ్యూహాత్మక ప్రాంతం. హిమాలయాల్లో కాపలా కాసే సైన్యానికి ఏడాది పొడవునా ఆయుధాలు, ఆహారం, టెంట్లు తదితర అవసరాలను సరఫరా చేస్తునే ఉండాలి. కొన్నిసార్లు హెలికాప్టర్లలో సరఫరా చేయగలిగినా అన్నీ సార్లు కుదిరేది కాదు. అందుకనే ప్రధానమంత్రిగా వాజ్ పేయి ఉన్నపుడు ఈ టన్నెల్ నిర్మాణానికి శ్రీకారుం చుట్టారు. తర్వాత యూపీఏ ప్రభుత్వంలో కూడా పనులు జరిగాయి. 2014లో మోడి ప్రధానమంత్రి అయిన తర్వాత పనుల్లో ఒక్కసారిగా వేగం అందుకుంది.

మొత్తం మీద పై ప్రాంతాల్లోని జనాలకు మాత్రమే కాకుండా సైన్యానికి ఈ టన్నెల్ ఎంతో ఉపయోగం. టన్నెల్ నిర్మాణం వల్ల ప్రయాణంలో 7 గంటలు, 45 కిలోమీటర్లు కలిసి వస్తుంది. టన్నెల్ నిర్మాణం వల్ల ప్రయాణించాల్సిన దూరం, సమయం కలిసి రావటమే కాకుండా ఏడాదిలో ఒక్కరోజు కూడా మంచు, భారీ వర్షాల వల్ల రోడ్డును మూసేయాల్సిన అవసరం ఉండదు. ఇది సైన్యానికి చాలా ఉపయోగపడుతుంది. మనదేశం ఇటువంటి ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేసుకుంటున్న కారణంగానే డ్రాగన్, పాకిస్ధాన్ దేశాలకు కడుపులో మంటలు పుడుతున్నాయి. మనపై అకారణంగా ఈర్ష్యకు కూడా ఇటువంటివే కారణాలవుతున్నాయి. ముందు ముందు ఇంకెంతగా మండిపోతాయో చూడాలంటే కొద్దికాలం వెయిట్ చేయాల్సిందే.