జేసీ కుటుంబం దూకుడు: ప‌గ్గాలు వేయ‌లేక బాబు తంటాలు

అనంత‌పురం జిల్లాలో కీల‌క రాజ‌కీయ కుటుంబంగా ఉన్న జేసీ దివాక‌ర్‌, ప్ర‌భాక‌ర్‌రెడ్డి రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు ప‌గ్గాలు వేయ‌లేక పోతున్నారా? చంద్ర‌బాబు వారికి అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను ప‌క్క‌న పెట్టి.. త‌మ‌కు సంబంధం లేని నియోజ‌క‌వ‌ర్గంలోనూ వారు చ‌క్రం తిప్పుతుండడంతో పార్టీకి త‌ల‌నొప్పిగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న జేసీ కుటుంబం నుంచి గ‌త ఏడాది ఇద్ద‌రు వార‌సులు రంగంలోకి వ‌చ్చారు. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు జేసీ ప‌వ‌న్‌, దివాక‌ర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డి గ‌త ఏడాది పోటీ చేశారు.

అయితే, జ‌గ‌న్ సునామీ నేప‌థ్యంలో అనంత‌పురం పార్ల‌మెంటు నుంచి పోటీ చేసిన ప‌వ‌న్‌, తాడిప‌త్రి నుంచి పోటీ చేసిన అస్మిత్ ఓడిపోయారు. అయితే, ఈ ఇద్ద‌రు యువ నేత‌ల‌ను ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నితీరు మెరుగుప‌రుచుకోవాల‌ని, పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు సూచించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. అనంత‌పురం అర్బ‌న్‌పై ప‌ట్టు సాధించేందుకు జేసీ ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఇక్క‌డి నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. వాస్త‌వానికి ఇక్క‌డ టీడీపీ నాయ‌కుడిగా ప్ర‌భాక‌ర్ చౌద‌రి ఉన్నారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో చౌద‌రి ఇక్క‌డ విజ‌యం సాధించారు.

అయితే, త‌మ‌కు స‌మీపంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ కూడా త‌మ‌దే పైచేయి కావాల‌నే ఉద్దేశంతో జేసీ వ‌ర్గం అర్బ‌న్‌లోనూ చ‌క్రం తిప్పుతోంది. ఈ ప‌రిణామం.. ప్ర‌భాక‌ర్‌చౌద‌రికి తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో ఆయ‌న ఈ విష‌యంపై ఇప్ప‌టికే రెండు సార్లు.. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

అయిన‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ వైఖ‌రిలో మార్పు రాలేదు. పైగా అంతా త‌న‌దే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చినా లెక్క చేయ‌డం లేదు. పైకి చంద్ర‌బాబు హెచ్చ‌రించినా.. జేసీ వ‌ర్గాన్ని నిర్దిష్టంగా క‌ట్ట‌డి చేసే అవ‌కాశం కూడా ఆయ‌న‌కు లేదు. దీంతో జేసీ ప‌వ‌న్ వ‌ర్గం చెల‌రేగిపోతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చంద్ర‌బాబు మాత్రం ఏం చేయాలో అర్ధం కాక త‌ల‌ప‌ట్ట‌కుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.