నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్టాలంటే ద‌డ‌ద‌డ‌!!

వైసీపీ నేత‌లు కొంద‌రు పార్టీ నుంచి వెళ్లిపోయారు. మ‌రికొంద‌రు త‌ట్టాబుట్టా స‌ర్దుకున్నారు. అయితే.. ఇంకొంద‌రు.. నియోజ‌క‌వ‌ర్గాల‌కు దూరంగా ఉంటున్నారు. క‌నీసం నాలుగు మాసాల్లో ఒక్క‌సారి కూడా నియోజ‌క‌వ‌ర్గాల మొహం చూడ‌ని ఫైర్ బ్రాండ్లు ఉన్నారంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. వీరిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మంత్రి.. కొడాలి నాని హైద‌రాబాద్ వ‌ర‌కు ప‌రిమితం అయ్యారు. ఏదైనా పని ఉండి ఏపీలోకి వ‌స్తున్నా.. ఆయ‌న విజ‌య‌వాడ వ‌ర‌కు వ‌చ్చి.. ఆ వెంట‌నే వెళ్లిపోతున్నారు.

ఇక‌, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే, వివాదాస్ప‌ద నాయ‌కుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ అస‌లు అజ లేకుండా పోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న అమెరికాలో ఉంటున్నార‌ని చెబుతున్నా.. నాలుగు నెల‌లుగా ఆయ‌న అమెరికాలోనే ఉంటున్నారా? అనేది సందేహం. ఇక‌, మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్‌, రోజా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలో కాలు పెట్ట‌కుండా.. పైపైనే రాజ‌కీయాలు చేస్తున్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అస‌లు పుంగ‌నూరు మొహం చూసి మూడున్న‌ర మాసాలైంది.

అలాగే.. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో వైసీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేవారే క‌రువ‌య్యారు. ఎన్నిక‌ల‌కు ముందు టికెట్‌ను ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌కు ఇవ్వ‌డంతో ఇక్క‌డి నేత మ‌ల్లాది విష్ణు నాకెందుకులే అని త‌ప్పించుకుంటున్నారు. ఇక‌, వెల్లంప‌ల్లి ఓడిపోయిన త‌ర్వాత‌.. ఇంటికి, వ్యాపారాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. అదేవిధంగా అనంత‌పురం జిల్లా పెనుకొండలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. పెనుకొండ నుంచి అప్ప‌టి మంత్రి ఉష‌శ్రీచ‌ర‌ణ్ పోటీ చేసి ఓడిపోయారు.

త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గం జోలికి కూడా పోవ‌డం లేదు. బెంగ‌ళూరు-హైద‌రాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. 50 నుంచి 60 మంది నాయ‌కులు నియోజ‌క‌వ‌ర్గాల మొహం చూడ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ కూట‌మి నాయ‌కుల దూకుడు ఎక్కువ‌గా ఉండ‌డంతోపాటు.. గ‌తంలో జ‌రిగిన అక్ర‌మాల‌ను వెలికి తీస్తున్నారు. దీంతో ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెడితే.. ర‌చ్చ మ‌రింత పెరుగుతుంద‌ని భావిస్తూ.. నాయ‌కులు సైలెంట్ అయ్యార‌ని తెలుస్తోంది.