ఏపీ ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్లు.. కూట‌మికి ప‌దిలంగా.. !

రాష్ట్రంలో ప‌ట్ట‌భ‌ద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. వ‌చ్చే నెలలో ఈ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌త్య‌క్షంగా జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల త‌ర‌ఫున ఇద్ద‌రూ టీడీపీ నాయ‌కుల‌కే అవ‌కాశం చిక్కింది. దీంతో వీరిని గెలిపించుకోవ‌డం ద్వారా టీడీపీ త‌న హ‌వాను నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్లు ప‌దిలింగా టీడీపీకి ప‌డాల‌న్న ల‌క్ష్యంతో ఉండ‌డం గ‌మ‌నార్హం.

కూట‌మి పార్టీలైన జనసేన, బీజేపీల సమన్వయంతో నాయ‌కులు ముందుకు న‌డవాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. అయితే.. ఇప్పుడు.. గ‌త రెండు మాసాల ముందున్న ప‌రిస్థితి అయితే.. లేదు. కొంత తేడా కొడుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వ‌చ్చిన ఎన్నిక‌లను ఎదుర్కొన‌డం అనేది అంత ఈజీకాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అంటే.. క్షేత్ర‌స్థాయిలో ఉన్న చిన్న‌పాటి లుక‌లుక‌లు.. నేత‌ల మ‌ధ్య విభేదాలుగా మారి.. ఐక్య‌త‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌న్న భావ‌న వ్య‌క్త‌మవుతోంది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగే.. ఉమ్మడి తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు ఇటీవ‌ల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీయే అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. జనసేన, బీజేపీలతో సమన్వయంతో ముందుకెళ్లాలని క్షేత్ర‌స్థాయిలో త‌మ్ముళ్ల‌కు సూచించారు. ఒక్క ఓటు కూడా చేజార కూడ‌ద‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎన్నికల అభ్యర్ధిగా పేరాబత్తుల రాజశేఖర్, గుంటూరు – కృష్ణా జిల్లాల అభ్యర్ధిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఖ‌చ్చితంగా గెలిపించుకునే బాధ్య‌త‌ల‌ను పార్టీ నాయ‌కుల‌కే అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. అవ‌స‌రమైతే.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు న‌మోదు ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించాల‌న్న‌ది కూడా.. చంద్ర‌బాబు వ్యూహం. త‌ద్వారా.. ప్ర‌తి ఓటుకూ ఎంతో విలువ ఉంది కాబ‌ట్టి.. ఓటర్ల నమోదును అత్యంత కీల‌కంగా తీసుకోవాల‌ని కూడా చంద్ర‌బాబు ఆదేశించారు. మ‌రి త‌మ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.