జ‌గ‌న్ నాయ‌కుడో.. శాడిస్టో..: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు వైఎస్ జ‌గ‌న్‌పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. జ‌గ‌న్ నాయ‌కుడో శాడిస్టో… వైసీపీ నాయ‌కులు ఆలోచించుకోవాల‌ని ఆమె అన్నారు. శ‌నివారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆస్తుల వివాదాలు-జ‌గ‌న్ వైఖ‌రిపై ఘాటుగా స్పందించారు.

తాను అడ్డు చెప్ప‌క‌పోవ‌డం వ‌ల్లే.. సాక్షి, భార‌తి సిమెంట్స్‌కు వారి పేర్లు పెట్టుకున్నార‌ని చెప్పారు. అదే తాను అడ్డు చెప్పి ఉంటే.. ఎలా ఉండేదో ఆలోచించుకోవాల‌ని అన్నారు. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు వారివి అయిపోవ‌న్నారు. త‌న చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి కూడా.. జ‌గ‌న్‌కు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వైసీపీలో ఉన్నారు కాబ‌ట్టి విజ‌య‌సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు జ‌గ‌న్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నార‌ని ష‌ర్మిల చెప్పారు. త‌మ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌న‌వ‌ళ్ల‌కు అంద‌రికీ స‌మానంగా ఆస్తులు పంపిణీ చేయాల‌ని ఆశించార‌ని.. దీనికి జ‌గ‌న్ కూడా ఒప్పుకొన్నారని చెప్పారు.

కాని.. ఆప్పుడు ఎవ‌రికొంగు చాటునో ఉండి ఆస్తులు మొత్తం సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తు న్నార‌ని విమ‌ర్శించారు. ఆస్తుల కేసుల్లో నేను జైలుకు వెళ్ల‌లేద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ భార్య భార‌తి జైలుకు వెళ్లిందా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఆస్తిని గిఫ్ట్‌గా ఇచ్చిన‌ప్పుడు ఎవ‌రైనా ఒప్పందం చేసుకుంటారా? అని నిల‌దీశారు.

వాడుకుని వ‌దిలేసే ర‌కం!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వాడుకుని వ‌దిలేసే ర‌క‌మ‌ని ష‌ర్మిల అన్నారు. ఎవ‌రితోనైనా అవ‌స‌రం ఉంద‌నుకుంటే.. వాడుకుంటాడ‌ని.. అవ‌స‌రం లేద‌ని అనుకుంటే అణిచేస్తార‌ని దుయ్య‌బ‌ట్టారు. క‌న్న‌త‌ల్లిని కోర్టుకు ఈడ్చిన దౌర్భాగ్యుడు ఎవ‌రైనా ఉన్నారా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

ఇలాంటివి చూసేందుకేనా ఇంకా బ‌తికి ఉన్నాన‌ని త‌ల్లి క‌న్నీరు పెట్టుకుంటున్న‌ట్టు చెప్పారు. `నాకు అన్యాయం జ‌రిగేలా చిన్నాన్న‌(వైవీ సుబ్బారెడ్డి) మాట్లాడ‌డం బాధ‌గా ఉంది“ అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల క‌న్నీటి ప‌ర్యంత మ‌య్యారు. వైఎస్ కుటుంబం వీధిన ప‌డుతుంద‌నే ఎంవోయులను బ‌య‌ట పెట్ట‌లేద‌ని ష‌ర్మిల చెప్పారు.