వాసిరెడ్డి ప‌ద్మ‌.. దారెటు?

వాసిరెడ్డి ప‌ద్మ‌.. ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌గా ప‌నిచేసి, వైసీపీలో మౌత్ పీస్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఉమ్మ‌డి ఏపీ నుంచి ప్ర‌స్తుతం వ‌ర‌కు కూడా వైసీపీకి బ‌లమైన నాయ‌కురాలిగా ప‌ద్మ గుర్తింపు పొందారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉన్న‌ప్పుడు.. ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు ప్ర‌య‌త్నించారు. కొన్నాళ్లు అక్క‌డ ఉన్నారు. ఇక‌, ఆ త‌ర్వాత వైఎస్ మ‌ర‌ణంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నిత్యం హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి జోష్ పెంచారు.

రాష్ట్రంలో వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ .. వాసిరెడ్డి ప‌ద్మ‌కు మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ప‌దవిని అప్ప‌గించారు. అయితే.. ఆమె 2019లోను, 2024 ఎన్నిక‌ల్లోనూ అసెంబ్లీ టికెట్ ఆశించారు. జ‌గ్గ‌య్యపేట‌ నుంచి పోటీ చేయాల‌ని ఉంద‌ని కూడా చెప్పుకొచ్చారు.

అయితే.. జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యంలో వెనుకంజ వేశారు. జ‌గ్గ‌య్య‌పేట‌లో సామినేని ఉద‌య‌భాను ఉన్న నేప‌థ్యంలో ఆమెకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో పార్టీలో అయినా.. ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆమె ఆశించారు.

మ‌రీ ముఖ్యంగా ఇటీవ‌ల సామినేని ఉద‌య‌భాను జ‌న‌సేన తీర్థం పుచ్చుకోవ‌డంతో జ‌గ్గ‌య్య‌పేట వైసీపీ ఇంచార్జ్ ప‌ద‌వి ఖాళీ అయింది. దీంతో ఆ ప‌ద‌విని ప‌ద్మ ఆశించారు. కానీ, వైసీపీ అధిష్టానం దీనికి మొగ్గు చూప‌లేదు.

ఈ ప‌రిణామాల‌తోనే ప‌ద్మ బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని వైసీపీ వ‌ర్గాలు స‌హా రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు ప‌ద్మ ఏ దారిలో న‌డుస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. ప‌ద్మ జ‌న‌సేన పార్టీవైపు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు.. ప‌ద్మ ఆ పార్టీలోనూ రాజ‌కీయాలు చేశారు. సో.. ఈ ప‌రిచ‌యాల నేప‌థ్యంలో జ‌న‌సేన వైపు ఆమె అడుగులు వేస్తార‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.