జ‌గ‌న్ జీవో… వైసీపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందిగా!

ఇటీవ‌ల వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. పార్టీ సోష‌ల్ మీడియాపై ప‌దునైన వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియా పుంజుకునేలా చేయాల‌ని, తాము యుద్ధం చేస్తున్న‌ది కేవ‌లం టీడీపీపైనే కాద‌ని.. ఆ పార్టీని, కూట‌మిని స‌మ‌ర్థించే మ‌రికొన్ని మీడియా సంస్థ‌ల‌పై కూడా అని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియాను యాక్టివేట్ చేయాల‌ని కూడా ఆయ‌న సూచించారు.

దీంతో వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం.. త‌మ‌కు ప‌గ్గాలు అప్ప‌గించేశారు..రెచ్చిపోదాం.. అన్న‌ట్టుగా వ్య‌వహరిస్తోంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో చూసుకుంటే.. జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన 247 జీవో.. ఇప్పుడు వైసీపీకి ప్ర‌తిబంధ‌కంగా మారింది. నిజానికి వైసీపీ హ‌యాంలో టీడీపీ స‌హా.. ఇత‌ర వ్య‌క్తిగత సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వాని కి వ్య‌తిరేకంగా కామెంట్లు వ‌చ్చేవి. ఆ వెంట‌నే ఈ జీవోను ఆధారం చేసుకుని.. కేసులు పెట్టేవారు. అమ‌రావ‌తికి చెందిన రంగ‌నాయ‌క‌మ్మ స‌హా.. అనేక మంది ఈ జీవో బాధితులే.

అప్ప‌ట్లో జీవో 247ను ర‌ద్దు చేయాల‌ని పెద్ద ఎత్తున టీడీపీ నాయ‌కులు, స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌లు కూడా.. ఉద్య‌మించారు. కోర్టుల‌కు కూడా వెళ్లారు. కానీ.. ఈ కేసు ఎలానూ తేల‌లేవు. దీంతో ఆ జీవో లైవ్‌లోనే ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు కొంత మేర‌కు అరెస్టులు త‌గ్గినా.. జీవోను మాత్రం జ‌గ‌న్ వెన‌క్కి తీసుకోలేదు. ఇక‌, ఇప్పుడు కూట‌మి స‌ర్కారు జ‌గ‌న్ హ‌యాంలో తెచ్చిన ల్యాండు టైటిలింగ్ చ‌ట్టాన్ని ర‌ద్దు చేసింది. చెత్త ప‌న్నును కూడా ర‌ద్దు చేసింది. కానీ, ఈ జీవోను మాత్రం ర‌ద్దు చేయ‌లేదు.

ఇదే ఇప్పుడు వైసీపీకి, ఆ పార్టీ సోష‌ల్ మీడియాకు ఇబ్బందిగా మారింది. తాజాగా పార్టీ సోష‌ల్ మీడియా కంటెంట్ రైట‌ర్ ర‌వికిర‌ణ్ ను గుడివాడ పోలీసులు అరెస్టు చేశారు. చంద్ర‌బాబు అవినీతి చేస్తున్నారంటూ .. ఆయ‌న పెట్టిన పోస్టుపై అరెస్టు చేయ‌డం.. కోర్టు ఆయ‌న‌కు బెయిల్ ఇవ్వ‌డం తాజా ప‌రిణామాలు. ఈ వ్య‌వ‌హారం వైసీపీలో కాక‌రేపుతోంది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఎలా స్పందిస్తే.. ఏం జ‌రుగుతున్న‌ది పార్టీ నాయ‌కుల‌ను త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురి చేస్తోంది. మ‌రి ఏవిధంగా ముందుకు సాగుతారో చూడాలి.