1996 నాటి చంద్రబాబును చూస్తున్నా: రామ్మోహన్ నాయుడు

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అమరావతి, మంగళగిరి, విజయవాడలో 2 రోజులపాటు జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై రామ్మోహన్ నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు.

సీఎం చంద్రబాబు ఎప్పుడు కొత్త ఆలోచనలు చేస్తుంటారని, యువతతో పోటీపడి ఆయన పని చేస్తుంటారని ప్రశంసించారు. సరికొత్త సాంకేతికతను వాడుకోవడం గురించి ఆయన చర్చలు జరుపుతుంటారని గుర్తు చేశారు. తాను కేంద్ర మంత్రిని అయ్యాక చాలా మంది ముఖ్యమంత్రులు ఎయి‌ర్‌పోర్టులు, హెలిపోర్టుల గురించి అడిగారని, ఎయిర్‌పోర్టులతో పాటు కనెక్టివిటీ, డ్రోన్‌ల ప్రాధాన్యం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రశంసించారు.

విజన్ 2020 గురించి 1996లో ఆలోచించారని తెలిపారు. రాబోయే ఎన్నికల గురించి కాకుండా రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు ఆలోచిస్తుంటారని చెప్పారు. హైదరాబాద్ అన్ని రంగాల్లో నేడు అభివృద్ధి చెందిందని,1996లో చంద్రబాబు హైదరాబాద్ గురించి మాట్లాడిన జీల్‌తో డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు.

అదే విధంగా దేశాభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి ప్రధాని మోడీ అని కొనియాడారు. ఏ దేశం వెళ్లినా భారత్ గురించి, మోడీ పాలనలో సాధించిన అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. పదేళ్ల క్రితం 74 ఉన్న ఎయిర్ పోర్టుల సంఖ్యను 150కు పెంచామని చెప్పారు.

రాబోయే 20 ఏళ్లలో 200కు పైగా విమానాశ్రయాలు వస్తాయని, ప్రయాణికుల సంఖ్యను బట్టి విమానాశ్రయాలు, విమానాలు పెంచుతామని చెప్పారు. కాగా, డ్రోన్ల వినయోగానికి కేంద్రం తోడ్పాటు అందిస్తుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి చెప్పారు. డ్రోన్ నిబంధనలను కేంద్రం సులభతరం చేసిందని, డ్రోన్ స్టార్టప్ లను, యువత పాత్రను కేంద్రం ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక, డ్రోన్ల సమర్థవంతమైన వినియోగం కోసం సలహాలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.