డ్రోన్లు.. రౌడీ షీటర్లకు చంద్రబాబు వార్నింగ్

రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అమరావతిలో డ్రోన్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రోన్ సమ్మిట్ ఏపీలో ఏర్పాటు చేశారు. మంగళగిరిలో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్-2024’ ను ఏపీ సీఎం చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించారు.

ఆ తర్వాత సదస్సులో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి తాను కృషి చేశానని, ఆనాడే ఐటీ అభివృద్ధి కోసం బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దామని చంద్రబాబు అన్నారు.

అమెరికా వెళ్లి 15 రోజుల్లో అనేక సంస్థలను కలిసి వచ్చామని, ఆ రోజుల్లోనే పిపిపి ద్వారా హైటెక్ సిటీని నిర్మించామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు చాలా సమర్థవంతులని కొనియాడారు. విదేశాల్లోని భారతీయ ఐటీ నిపుణులలో 30 శాతం తెలుగువారని చెప్పుకొచ్చారు.

ఈ రోజు ఐటీ రంగంలో తెలుగు వాళ్లు అగ్ర స్థానాల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. విజయవాడ వరదల్లో డ్రోన్ వినియోగించి వరద బాధితులకు తాగునీరు, ఆహారం అందించామని అన్నారు. వ్యవసాయం, మౌలిక వసతుల వ్యవహారంలో డ్రోన్లది కీలక పాత్ర అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

భవిష్యత్తులో వైద్యరంగంలో పెనుమార్పులు రాబోతున్నాయని, ఇంటి దగ్గర నుండి చికిత్స తీసుకోవచ్చని అన్నారు. భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్ కాబోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం, కొన్ని చోట్ల శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం కూడా డ్రోన్ కెమెరాలను వాడవచ్చని చెప్పారు. విజిబుల్ పోలీస్, ఇన్విసిబుల్ పోలీసింగ్ అన్న కాన్సెప్ట్ ను పరిశీలిస్తున్నామని అన్నారు. డ్రోన్ కెమెరాలు, శాటిలైట్ డేటాల ద్వారా నేరాలను అరికట్టవచ్చని రౌడీ షీటర్లకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.