బ‌డ్జెట్‌పై బాబు వ్యూహం.. ఈ సారికి ఉందా.. లేదా..?


ప్ర‌తి ఆర్థిక సంవ‌త్స‌రంలోనూ ప్ర‌భుత్వాలు తమ‌కు వ‌చ్చే ఆదాయాన్ని, చేసే వ్య‌యాన్ని కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. అసెంబ్లీలో ప్ర‌క‌టించి ఆమేర‌కు చేయాలి. ఇది దేశ‌వ్యాప్తంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏటా చేసే ప‌నే. అయితే.. ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంతో ఓటాన్ అకౌంట్‌(4 మాసాల‌కు) వైసీపీ ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టింది. ఏప్రిల్ నుంచి జూలై వ‌ర‌కు ఇది కొన‌సాగింది.

జూన్‌లో ఏర్ప‌డిన‌ కూట‌మి ప్ర‌భుత్వం.. కొత్త‌గా మిగిలిన 8 నెల‌ల కాలానికి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశపెట్టారు. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాది జూలైలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ స‌మావేశాల‌కు బ‌డ్జెట్ స‌మావేశాల‌నే పేరు కూడా పెట్టారు. కానీ, బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డం మానేసి కేవ‌లం శ్వేత ప‌త్రాల‌ను మాత్ర‌మే ప్ర‌వేశ పెట్టి వ‌దిలేశారు. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని.. దీంతో తాము అక్టోబ‌రులో ప్ర‌త్యేకంగా స‌మావేశాలు నిర్వ‌హించిన బ‌డ్జెట్‌ను అప్పుడు పెడ‌తామ‌న్నారు.

ఈ విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా చెప్పుకొచ్చారు. అయితే.. అక్టోబ‌రు కూడా అయిపోయింది. మ‌రో 10 రోజుల్లో అక్టోబ‌రు మాసానికి కూడా ఎండ్ కార్డు ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో ఈ నెల‌లో కూడా బ‌డ్జెట్ లేన‌ట్టేన‌ని తెలిసిపోయింది. అంటే.. జూలైతో ముగిసిన వైసీపీ బ‌డ్జెట్‌ను ఆర్డినెన్స్ ద్వారా పొడిగిస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మాసాల‌కు పొడిగించారు. ఇక‌, ఇప్పుడు కూడా మ‌రోసారి పొడిగించి.. వ‌చ్చే ఏడాది నుంచి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

త‌ద్వారా.. ప్ర‌స్తుతం ఉన్న ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సీఎం చంద్రబాబు ఆలోచ‌న చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు భారీ స్థాయిలో నిధుల అవ‌స‌రం ఉంది. దీనిని పుర‌స్క‌రించుకుని.. సంప‌ద సృష్టిపైనే ప్ర‌స్తుతం దృష్టి పెట్టి.. త‌ర్వాత‌.. బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టి.. ప‌థ‌కాల‌కు నిధులు కేటాయించాల‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాదికి ఇక‌, బ‌డ్జెట్ లేన‌ట్టేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందోచూడాలి.