స‌జ్జ‌ల అరెస్టు… డేట్ ఫిక్స్ అయిందా..?

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ మాజీ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని అరెస్టు చేయ‌డం ఖాయ‌మైన‌ట్టు తెలిసింది. అయితే.. దీనికి సంబంధించి కొంత త‌ట‌పటాయింపు అయితే జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న‌ను టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై జ‌రిగిన దాడి కేసులో విచారిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఆయ‌న 120వ నిందితుడిగా ఉన్నారు. దీంతో ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లోనే ఆయ‌న‌ను ఉంచారు. అయితే.. దీనికంటే బ‌ల‌మైన కేసు కోసం అన్వేష‌ణ సాగుతున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌భుత్వ నిధుల దుర్వినియోగం అంశాన్ని కూట‌మి ప్ర‌భుత్వం అన్వేషిస్తోంది. స‌ల‌హాదారుగా ఉండి.. ఆయ‌న‌కుఇచ్చిన జీతం ఎంత‌? ఆయ‌న‌కు ఇచ్చిన అధికారిక సౌక‌ర్యాలు వంటివాటిపై కూపీ లాగుతోంది. ఈ కేసు క‌నుక న‌మోదైతే.. ఇక‌, స‌జ్జ‌ల ఒక్క‌రే ఈ కేసులో నిందితుడిగా ఉంటారు. దీంతో ఈ కేసును ఈజీగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇక‌, టీడీపీ కార్యాల‌యం కేసును సీఐడీకి అప్ప‌గించారు.

ఈ కేసు విచార‌ణలో 120వ నిందితుడిగా ఉన్నందున ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న‌ను అరెస్టు చేయ‌లేదు. అందుకే ప్ర‌భుత్వ నిధుల‌ను దొడ్డిదారిలో జీతంగా తీసుకున్నార‌న్న కేసుతో పాటు.. ప్ర‌భుత్వ విధుల్లోనూ జోక్యం చేసుకున్న వ్య‌వ‌హారంపై కేసు న‌మోదుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌తంలో క‌ర్నూలులో ప‌ర్య‌టించిన‌ప్పుడు.. ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్‌పై స‌జ్జ‌ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. ఇప్పుడు స‌ద‌రు హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు. ఈయ‌న ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి.

అదేవిధంగా గుంటూరులో ప‌నిచేసిన ఓ ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన డీఎస్పీపైనా.. స‌జ్జ‌ల దురుసుగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈయ‌న కూడా రిటైర్ అయ్యారు. ఇప్పుడు వీరిని తెర‌మీదికి తెచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. విధుల్లో ఆటంకాలు క‌లిగించ‌డ‌మే కాకుండా.. త‌మ‌ను దూషించారంటూ.. వారితో ఫిర్యాదు చేయించే దిశ‌గా పోలీసు పెద్ద‌లు వ్యూహం సిద్ధం చేశారు. ఈ కేసులు క‌నుక న‌మోదైతే.. త‌క్ష‌ణ‌మే అట్రాసిటీ చ‌ట్టం కింద స‌జ్జ‌ల‌ను అరెస్టు చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. మొత్తంగా ఇదంతా .. నెల రోజుల్లోనే పూర్తి చేయ‌నున్న‌ట్టు హోం శాఖ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది.