జ‌గ‌న్ వ‌ర్సెస్ లోకేష్‌: లా అండ్ ఆర్డ‌ర్ రాజ‌కీయం!

ఏపీలో ‘లా అండ్ ఆర్డ‌ర్‌’పై తాజాగా రాజ‌కీయ దుమారం రేగింది. తాజాగా శ‌నివారం.. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గంలో ఇంట‌ర్ చ‌దువుతున్న ఓ బాలిక‌(15ఏళ్లు)ను అదే జిల్లా, ఆ బాలిక సొంత ప‌ట్ట‌ణానికే చెందిన విఘ్నేష్(21) అనే వివాహితుడు వేధించాడు. అంతేకాదు.. ప్రేమ పేరుతో ఉన్మాదిలా వ్య‌వ‌హ‌రించి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 10 గంట‌ల పాటు అల్లాడిపోయిన బాలిక‌.. చివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయింది.

ఈ ప‌రిణామంపై వైసీపీ అధినేత జ‌గ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కూట‌మి స‌ర్కారుకు ప్ర‌శ్న‌లు సంధించారు. అయితే.. జ‌గ‌న్ చేసిన పోస్టుకు రిప్ల‌య్‌గా మంత్రి, టీడీపీ నాయ‌కుడు నారా లోకేష్ కూడా.. తీవ్రంగా స్పందించారు. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌ను ఉటంకిస్తూ.. తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. దీంతో అటు జ‌గ‌న్‌, ఇటు నారా లోకేష్ మ‌ధ్య లా అండ్ ఆర్డ‌ర్ రాజ‌కీయం ఓ రేంజ్‌లో సాగుతోంది. గ‌త పాల‌న‌పై నారా లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించ‌గా.. కూట‌మిపై జ‌గ‌న్ నిప్పులు చెరిగారు.

ఇదేమి రాజ్యం: జగ‌న్‌

“లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్ర‌బాబు గారూ? మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం? క‌డ‌ప జిల్లా బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు” అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి: లోకేష్‌

“ఇంట్లో బాబాయ్‌ని చంపేసిన పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి. నీ పార్టీ పునాదులే నేరాలు- ఘోరాలు అని మీ కుటుంబ సభ్యులే చెప్పారు. నీ పాలనలో వేల మంది చనిపోయినా, ఏ నాడు ఒక్క మాట, కనీసం ఒక్క సమీక్ష కూడా చేయని నువ్వు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావ్. మా ఖర్మ.. 5 ఏళ్ళ పాటు గంజాయి, డ్రగ్స్ ని వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్. ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి, ప్రజల మీదకు వదిలావ్. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు బ్రతికే లైసెన్స్ ఇచ్చావ్. నీ తమ్ముడు అవినాష్ రెడ్డి హత్య చేసినా కాపాడావ్. అనంతబాబు లాంటి వాడు దళితులని చంపితే, ఇంటికి పిల్చి భోజనం పెట్టావ్. మహిళలని వేధించిన వారిని అందలం ఎక్కించావ్. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చావ్. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.