జ‌గ‌న్‌ ఆరు నెల‌ల టార్గెట్‌.. వైసీపీ మారిపోతుందా?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాజాగా నిర్వ‌హించిన ఆ పార్టీ నేత‌ల వ‌ర్క్ షాపులో నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు.. ఆరు మాసాల టార్గెట్ పెట్టారు. “ఆరు మాసాల్లో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన బాధ్య‌త మీదే” అంటూ నొక్కి చెప్పారు. అంద‌రూ ఒకే తాటిపై నిలిచి.. పార్టీని ముందుకు న‌డిపించాల‌ని కూడా ఆయ‌న ఆదేశించారు. అంతేకాదు.. ఎక్క‌డైనా చిన్న‌పాటి విభేదాలు ఉన్నా.. వాటిని ప‌రిష్క‌రించే బాధ్య‌త సీనియ‌ర్లు తీసుకోవాల‌ని.. అంద‌రినీ క‌లుపుకొని ముందుకు సాగాల‌ని కూడా సూచించారు.

అయితే.. ఇది చెప్ప‌డానికి బాగానే ఉంది. కానీ, పోతున్న నాయ‌కులు పోతూనే ఉన్నారు. తాజాగా నిర్వహించిన వ‌ర్క్ షాపున‌కు కూడా రెండు జిల్లాల నుంచి ముఖ్య నాయ‌కులు రాలేదు. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ ఆరా తీయ‌క‌పోయినా.. మీడియా ఆరా తీస్తోంది. వారు ప‌క్క చూపులు చూస్తున్నారు. అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతోనే వారు జ‌గ‌న్ పిలిచినా కీల‌క స‌మావేశానికి హాజ‌రు కాలేదు. ఇక‌, మ‌రికొందరు త‌మ వ్యాపారాలు, వ్య‌వ‌హారాల కోసం.. అధికార పార్టీ నేత‌ల‌తో చేతులు క‌లిపారు.

ఈ విష‌యం కూడా జ‌గ‌న్‌కు బాగానే తెలుసు. అయినా.. ఆయ‌న ఏమీ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. ఇక‌, మ‌రికొంద‌రు నాయ‌కులు.. జ‌గ‌న్ వైఖ‌రితో విసుగు చెంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు తాము ఎంత చెప్పినా విన‌కుండా నియోజ‌క‌వ‌ర్గాలు మార్చార‌న్న ఆవేద‌న నేత‌ల్లో ఉంది. ఈ కార‌ణంగా కొంద‌రు నాయ‌కులు పార్టీతో అంటీ ముట్ట‌న‌ట్టే ఉన్నారు. సో.. ఇలాంటి వారిని దారిలో పెట్టాల్సిన బాధ్య‌త‌, బుజ్జ‌గించాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్‌పైనే ఉంది.

ఇక‌, మ‌రీ ముఖ్యంగా గ‌తంలో ప‌ద‌వులు పొంది, మంత్రులుగా ప‌నిచేసిన వారు కూడా ఎడ‌మొహం పెడమొహంగానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వారిని లైన్‌లో పెట్టి పార్టీ కోసం ప‌నిచేయించుకోవ‌డం జ‌గ‌న్‌పైనే ఉన్న కీల‌క బాధ్య‌త‌. వీటిని విస్మ‌రించిన జ‌గ‌న్‌.. ఆరుమాసాల గ‌డువు పెట్టి పార్టీ పుంజుకునేలా చేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు, నేత‌ల‌కు చెప్పి చేతులు దులుపు కొంటే పార్టీ పుంజుకుంటుందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఏదేమైనా.. జ‌గ‌న్ మార‌లేదు.. అన్న‌మాట మ‌రో సారి నిజం చేసుకున్నారు.