నోరు చెడ్డదైతే ఎప్పటికైనా జైల్ కే అనిల్‌..

వైసీపీ కార్య‌క‌ర్త‌, గుంటూరు జిల్లా ప‌ట్టాభిపురం పోలీసుల రికార్డులో రౌడీ షీట‌ర్‌గా న‌మోదైన బోరుగ‌డ్డ అనిల్‌ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు తర‌లించ‌నున్నారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల అనంత‌రం.. ఫ‌లితాలపై సోష‌ల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు.. ఈవీఎంల‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ.. చేసిన దారుణ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో జూన్ 1న గుంటూరు పోలీసులు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు కేసు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం ఆయ‌న‌ను గుంటూరుజిల్లా అమ‌రావ‌తి రోడ్డులోని నివాసంలో అరెస్టు చేశారు.

తాజాగా గురువారం ఆయ‌న‌ను గుంటూరు ఐదో అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ వాద‌న‌ల అనంత‌రం .. రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యంలో 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. న్యాయాధికారి తీర్పు చెప్పారు. దీంతో రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించనున్నారు. అక్క‌డ అనిల్‌ను సాధార ఖైదీగా ట్రీట్ చేయాల‌ని న్యాయాధికారి ఆదేశించ‌డంతో జ‌న‌ర‌ల్ బ్యారెక్‌లోనే అనిల్‌ను ఉంచ‌నున్నారు.

అయితే.. ఎన్నిక‌ల సంఘం ఫిర్యాదు స‌హా.. గుంటూరు జిల్లాకు చెందిన క‌ర్ల‌పూడి బాబు అనే వ్య‌క్తిని అనిల్ 50 ల‌క్ష‌ల రూపాయ‌లు డిమాండ్ చేసిన‌ట్టు కూడా కేసు న‌మోదైంది. ఈ కేసులోనూ అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా ఈ రెండు కేసుల‌ను క‌లిపి విచారించిన కోర్టు అనిల్‌ను రాజ‌మండ్రి జైలుకు త‌ర‌లించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వైసీపీ హ‌యాంలో అనిల్ రెచ్చిపోయిన విధానం అంతా ఇంతా కాదు. సోష‌ల్ మీడియాలో తీవ్ర ప‌ద‌జాలంతో ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి, అప్ప‌టి విప‌క్ష నేత చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

జ‌గ‌న్ ఆదేశిస్తే.. పావుగంట‌లో వైసీపీ అస‌మ్మ‌తి నేత‌ కోటం రెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిని నెల్లూరు న‌డిరోడ్డుపైనే తంతాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, ప‌వ‌న్‌, చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌ను తీవ్రంగా దూషించేవారు. ఎవ‌రైనా కామెంట్లు చేస్తే వారిని కూడా బెదిరించేవారు. ఎంబీఏ చ‌దివాన‌ని అది కూడా లండ‌న్‌లో పూర్తి చేసుకున్నాన‌ని చెప్పుకొన్న అనిల్‌.. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు నోటికి, చేతికి కూడా ప‌ని చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి.