విచారణకు సజ్జల..పోలీసులకు వేలు చూపించి పొన్నవోలు

వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్ తదితరులపై ఆ దాడి కేసులో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారంతా ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఈ దాడి కేసులో ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ఉంది. ఈ కేసులో 120వ నిందితుడిగా సజ్జల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయనపై లుక్ అవుట్ నోటీసు కూడా జారీ అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మంగళగిరి పోలీసులు సజ్జలకు నోటీసులు పంపారు. దీంతో, ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం సజ్జల వచ్చారు. ఈ సందర్భంగా సజ్జల వెంట మాజీ ఏపీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వచ్చారు. అయితే, సజ్జలతో పాటు విచారణ అధికారి వద్దకు వెళ్లేందుకు తనను అనుమతించాలని పొన్నవోలు కోరగా అందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో, పోలీసులపై పొన్నవోలు అసహనం వ్యక్తం చేశారు. వేలు చూపిస్తూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.

తనను ఎందుకు పంపించారంటూ పోలీసులతో పొన్నవోలు వాదించారు. అయితే, కోర్టు అనుమతి తప్పనిసరి అని, ప్రస్తుతం విచారణకు సజ్జలను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.  పొన్నవోలు మాటను పోలీసులు ఖాతరు చేయకపోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి ఆయన తిరిగి వెళ్లారు.  దీంతో, సజ్జల ఒక్కరే పోలీస్‌స్టేషన్‌ లోకి వెళ్లగా…మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.

బయటి వ్యక్తులు ఆ ప్రాంతంలోకి రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా విచారణ ఏపీ పోలీసులు పూర్తి చేయగా…సీఐడీ అధికారులతో కలిసి సంయుక్తంగా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.