కేంద్రంలో చంద్రబాబే కింగ్ మేకర్…ఆ ఫొటో వైరల్

2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంతో పాటు ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సారి బీజేపీకి ఆశించినన్న సీట్లు రాకపోవడంతో మిత్ర పక్షాలపై ఎన్డీఏ ఆధారపడాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే దేశంలోని అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులలో ఒకరైన ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది. దీంతో, 21 ఎంపీ సీట్లున్న ఏపీ ఎన్డీఏ కూటమి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబుకు కేంద్రంలో బీజేపీ పెద్దలు అత్యంత గౌరవం ఇస్తున్నారు.

ప్రధాని మోదీ మొదలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరకు అంతా చంద్రబాబు అనుభవానికి విలువనిస్తున్నారు. దీంతో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కింగ్ మేకర్ చంద్రబాబు అని జాతీయ మీడియా కూడా పలుమార్లు కథనాలు ప్రసారం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబే కింగ్ మేకర్ అనేలా తాజాగా ఓ సన్నివేశం చర్చనీయాంశమైంది.

హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా చంద్రబాబును అమిత్ షా పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఓ పక్క బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, మరో పక్క అమిత్ షా, మధ్యలో చంద్రబాబు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

21 సీట్లు, అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి ఇచ్చే విలువ ఇది అంటూ టీడీపీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. గతంలో జగన్ 23 సీట్లు దక్కించుకున్నప్పటికీ ఇంత గౌరవం లభించలేదని, ఆయనపై ఉన్న కేసులే అందుకు కారణమని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు, వరుసగా మూడోసారి హరియాణాలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది.

హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి సైనీ ప్రమాణం చేశారు. పంచకులలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సైనీ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, కేంద్ర మంత్రి గడ్కరీ, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తదితరులు హాజరయ్యారు.