నూతన సీజేఐగా సంజీవ్ ఖన్నా?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం వచ్చే నెల 10వ తేదీతో ముగియనుంది. దీంతో, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును చంద్రచూడ్ ప్రతిపాదించారు. ఈ ప్రకారం సంజీవ్ కన్నా పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన సిఫారసు లేఖ రాశారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు.

సీజేఐ చంద్రచూడ్ తర్వాత సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో అత్యంత సీనియర్ జడ్జిగా సంజీవ్ ఖన్నా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పేరును చంద్రచూడ్ ప్రతిపాదించారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిజెఐ ప్రతిపాదించడం ఆనవాయితీ. ఆ తర్వాత ఆ ప్రతిపాదించిన పేరును లేఖ ద్వారా కేంద్ర న్యాయశాఖకు సీజేఐ పంపుతారు. ఆ లేఖను ప్రధానమంత్రి పరిశీలన కోసం కేంద్ర న్యాయశాఖ పంపుతుంది. ప్రధాని అనుమతి తీసుకున్న తర్వాత ఆ లేఖ రాష్ట్రపతి దగ్గరకు చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత ఈ నియామకం అధికారికంగా ఖరారవుతుంది.

నవంబర్ 11న సీజేఐ పదవి నుంచి చంద్రచూడ్ విరమణ చేయనున్నారు. కేంద్ర న్యాయ శాఖ, ప్రధాని, రాష్ట్రపతిల ఆమోద ముద్ర లభిస్తే నవంబర్ 12న జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత సుప్రీం కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. నవంబరు 12న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే 6 నెలల పాటు మాత్రమే ఈ పదవిలో కొనసాగనున్నారు. 2025 మే 13న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.