రేవంత్ సర్కారు తీసుకున్న కొత్త అప్పు వర్సెస్ తీర్చిన కిస్తీ

అప్పు మీద అప్పు తీసుకోవటమే కానీ చేస్తున్నది ఏమీ లేదంటూ రేవంత్ సర్కారు మీద బీఆర్ఎస్ ముఖ్యనేతలు తరచూ విరుచుకుపడుతుండటం చూస్తున్నదే. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత భారీ ప్రాజెక్టులు చేపట్టింది లేదు. సంక్షేమ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించిన విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి.అయితే.. చేసిన పనిని చెప్పుకోవటంలో దొర్లుతున్న తప్పులే

సర్కారుకు ఇబ్బందికరంగా మారాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ విసయం మీద ఫోకస్ చేసిన రేవంత్ సర్కారు తాజాగా తమ మీద వచ్చే విమర్శలు.. ఆరోపణలపై స్పందించటం షురూ చేసిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో మాజీ మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావులు అదే పనిగా రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్పులు తెచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయాన్ని లెక్కలతో సహా బయట పెట్టిన రేవంత్ సర్కారు.. బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్పులే దీనికి కారణమంటూ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాము తీసుకున్న మొత్తం అప్పు.. అదేసమయంలో తాము తీర్చిన పాత అప్పు లెక్కల్ని వెల్లడించింది.ఈ వివరాల్ని ప్రభుత్వం రాజకీయంగా కాకుండా ఆర్థిక శాఖ కార్యాలయం అధికారికంగా విడుదల చేయటం ద్వారా.. తమ వాదనకు విశ్వసనీయతను పెంచేలా చేసింది.

కొత్త ప్రభుత్వం గత డిసెంబరులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్టోబరు15 వరకు రూ.49,618 కోట్ల కొత్త అప్పుల్ని తీసుకున్నట్లు ప్రకటించింది.అయితే.. గతంలో (కేసీఆర్ ప్రభుత్వం) తీసుకున్న అప్పులకు కట్టాల్సిన అసలు.. వడ్డీలకు కలిపి ఇదే సమయంలో రూ.56,440 కోట్ల మొత్తాన్ని చెల్లించినట్లుగా పేర్కొంది. తాము కొత్త అప్పుల్ని తీసుకుంటున్నా.. వాటిని డెవలప్ మెంట్.. సంక్షేమానికి నిధులు కేటాయించలేని దుస్థితి నెలకొందని పేర్కొంది.

ఇవే కాకుండా మూలధన వ్యయం కింద రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.21,881 కోట్లు ఖర్చు చేసిందని.. రైతుల వ్యవసాయ రుణాల మాఫీ, ఒక్కో ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. రేషన్ బియ్యం.. ఉపకార వేతనాలు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలకు పది నెలల్లో మరో రూ.54,346 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోనప్పటికీ ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులందరికి జీతాలు చెల్లిస్తున్నట్లుగా పేర్కొంది. మొత్తంగా తమ ప్రభుత్వం అప్పులు తీసుకుంటున్నా.. అవన్నీ పాత బాకీలు.. వడ్డీలు చెల్లించేందుకే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయాన్ని చెప్పటం ద్వారా.. గులాబీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ లెక్కలపై బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.