మహేష్ కథ కాబట్టే 2 సంవత్సరాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో ప్యాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందాని అభిమానులే కాదు దేశవ్యాప్తంగా సగటు సినీ ప్రేమికులు విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం వచ్చి పది నెలలవుతున్నా ఇప్పటిదాకా కొత్త సినిమా అప్డేట్ లేక అభిమానుల ఆత్రుత మాములుగా లేదు. రచయిత విజయేంద్రప్రసాద్ ఎడారిలో వర్షంలా ఓ శుభవార్త చెప్పారు.

2025 జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చేశారు. డేట్ ఫలానా వివరాలు చెప్పలేదు కానీ చూచాయగా సంక్రాంతి పండగని అర్థం చేసుకోవచ్చు. ఇక కథ గురించి చెబుతూ మాములుగా ఏ స్టార్ హీరోకైనా స్టోరీ సిద్ధం చేయడానికి నెలల సమయం సరిపోతుందని, కానీ మహేష్ బాబు కాబట్టే రెండు సంవత్సరాలు పట్టిందని అన్నారు. ఇంత సుదీర్ఘమైన అనుభవమున్న టాప్ రైటరే ఇంత మాట అన్నారంటే సబ్జెక్టు ఏ రేంజ్ లో వచ్చి ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేదు కాని తక్కువ పదాలతోనే ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు విజయేంద్రప్రసాద్. మాస్టర్ క్లాస్ పేరుతో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ముచ్చట్లు పంచుకున్నారు. విచ్చేసిన అతిథుల నుంచి బాబు అంటూ మహేష్ కోసం ఛీర్స్ వినిపించడం గమనార్హం. సో ఇంకో రెండు నెలలకు పైగా ఎదురు చూడక తప్పదన్న మాట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ తాలూకు కీలక పనులు పూర్తి చేసిన రాజమౌళి రెండు మూడు వర్క్ షాప్స్ కూడా నిర్వహించారు.

మహేష్ లుక్ కు సంబంధించి ఫోటో షూట్స్ అయ్యాయి కానీ ఇంకా లుక్ ఫైనల్ చేయలేదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేనాటికి ఒక పోస్టర్ వదలాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నారట. రెండేళ్లు పడుతుందో లేక అంతకు మించే అవుతుందో తెలియదు కానీ ఫ్యాన్స్ విపరీతమైన ఎదురు చూపులకు సిద్ధపడాల్సిందే. క్యాస్టింగ్ సైతం క్రేజీగా ఉండబోతోంది. ఎవరూ ఊహించని తారాగణం ఎస్ఎస్ఎంబి 29లో భాగం కాబోతున్నారు.