రాక రాక వ‌చ్చిన స‌మంత‌.. ఏం మాట్లాడింది?

ఒక‌ప్ప‌టి టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత హైద‌రాబాద్‌లో ఓ సినిమా స్టేజ్ మీద మాట్లాడి చాలా కాల‌మే అయిపోయింది. ఖుషి మూవీ త‌ర్వాత తెలుగులో ఆమె సినిమానే చేయ‌లేదు. వేరే సినిమాల ఈవెంట్ల‌లోనూ మాట్లాడ‌లేదు. ఇటీవ‌ల కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో సామ్ పేరు అన‌వ‌స‌రంగా మీడియాలో నానింది.

ఈ నేప‌థ్యంలో స‌మంత పాల్గొన్న ఓ సినిమా ఈవెంట్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఆ చిత్ర‌మే.. జిగ్రా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. ఇది తెలుగులో రానా స‌మ‌ర్ప‌ణ‌లో ద‌స‌రా కానుక‌గా రిలీజ‌వుతున్న నేప‌థ్యంలో నిర్వ‌హించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సామ్ హాజ‌రైంది. అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సైతం ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స‌మంత ప్ర‌సంగం ఆస‌క్తి రేకెత్తించింది.

ఐతే ఇటీవ‌లి వివాదం జోలికి వెళ్ల‌కుండా సింపుల్‌గా త‌న స్పీచ్‌ను ముగించింది స‌మంత‌. త‌న‌ను క‌లిసే అమ్మాయిలంద‌రికీ మీ క‌థ‌లో మీరే హీరోలు అని చెప్పాల‌ని అనుకుంటాన‌ని.. జిగ్రా లాంటి సినిమాలు అవే సందేశాన్ని ఇస్తాయ‌ని సామ్ పేర్కొంది. గ‌త నెల‌లో 35 లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీని అందించిన రానా.. ఇప్పుడు జిగ్రాను తెలుగులో రిలీజ్ చేస్తుండ‌డం మంచి విష‌య‌మ‌ని ఆమె అంది. రానా త‌న‌కుసోద‌రుడు అని.. ప్ర‌తి అమ్మాయికీ రానా లాంటి బ్ర‌ద‌ర్ ఉండాల‌ని స‌మంత చెప్పింది.

రానాకు పెళ్ల‌యిపోయింది కాబ‌ట్టి అమ్మాయిలంద‌రికీ అత‌ను బ్ర‌ద‌రే అని సామ్ స‌ర‌దాగా వ్యాఖ్యానించింది. ఈ వేడుక‌కు వ‌చ్చిన వాళ్లంద‌రూ త‌న‌కు జిగ్రాలే అని చెప్పిన సామ్.. రాహుల్ ర‌వీంద్ర‌న్ త‌న‌కు 15 ఏళ్లుగా మంచి ఫ్రెండ్ అని, త‌న జీవితంలో అత‌డిది ముఖ్య పాత్ర అని పేర్కొంది. త్రివిక్ర‌మ్‌తో తాను మూడు సినిమాలు చేశాన‌ని అవి త‌న కెరీర్ ఎదుగుద‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని అంది. రానా నిర్మాణంలో ఓ బేబీ చేశాన‌ని, అది త‌న కెరీర్లో బిగ్గెస్ట్ ఫిలిం అని చెప్పింది. తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమ గురించి అంద‌రికీ తెలిసిందే అన్న సామ్.. వాళ్ల వ‌ల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంది.