దీపావళి పోటీలో నిఖిల్ సడన్ ఎంట్రీ

ఎప్పటి నుంచి నిర్మాణంలో ఉందో,- ఎప్పుడు షూటింగ్ జరిగిందో కానీ నిఖిల్ కొత్త సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ విడుదలకు సిద్ధమైపోతోంది. ఈ మేరకు దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్టు అధికారిక పోస్టర్ వదిలారు. బొమ్మరిల్లులోని బ్లాక్ బస్టర్ పాటలోని తొలి పల్లవిని టైటిల్ గా పెట్టుకున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ కాంబోలో గతంలో వచ్చిన స్వామి రారా సూపర్ హిట్ కాగా కేశవ ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఈ కలయిక సాధ్యం కాలేదు. సుధీర్ వర్మ గత చిత్రం రవితేజ రావణాసుర బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేదు.

అందుకే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సక్సెస్ తనకు చాలా కీలకం. అయితే ఎందుకు ఇంత జాప్యం జరిగిందనే దాని మీద రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి కానీ ఏదైనా ప్రెస్ మీట్ లో టీమ్ ని కలిసినప్పుడు మాత్రమే క్లారిటీ వస్తుంది. ఇందులో హీరోయిన్ గా సప్తసాగరాలు దాటి సైడ్ ఏబి ఫేమ్ రుక్మిణి వసంత్ టాలీవుడ్ కు పరిచయమవుతోంది. ఫస్ట్ లుక్ లో నిఖిల్ తో పాటు తననే హైలైట్ చేశారు. రెండో కథానాయికగా దివ్యంష నటిస్తోంది. గాయకుడు కార్తీక్ సంగీత దర్శకత్వం వహించగా సన్నీ ఎంఆర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు అప్పజెప్పారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో పెద్ద బడ్జెట్ పెట్టారు.

స్పై తర్వాత గ్యాప్ తీసుకున్న నిఖిల్ కు ఈ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. స్వయంభు రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అభిమానులకు ఆ లోటు తెలియకుండా ఈ సినిమా కవర్ చేస్తుందేమో. తొలి చిత్రం తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ చూడలేకపోయిన సుధీర్ వర్మ ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడనేది ఆసక్తికరం. దీపావళికి విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, సత్యదేవ్ జీబ్రా, శివ కార్తికేయన్ అమరన్ బరిలో ఉన్నాయి. వీటిలో ఒకటో రెండో తప్పుకునే ఛాన్స్ లేకపోలేదు. వాటి స్థానంలో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో దిగుతుంది.