రా మచ్చా వెనుక సోషల్ మీడియా రచ్చ

ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ రెండో పాట ‘రా మచ్చ రా’ మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఇన్ఫ్లు యెన్సర్లలకు భారీ డబ్బులు ఇచ్చి రీల్స్ చేయిస్తున్నారని, వాటి వల్లే త్వరగా వైరలవుతున్న భావన జనంలో కలిగిస్తున్నారని యాంటీ ఫ్యాన్స్ కొందరు పలు ఆధారాలు చూపించడంతో క్రమంగా ఈ టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ సైతం సొమ్ములు అందుకున్నట్టుగా ఒక ఫేక్ స్క్రీన్ షాట్ సృష్టించి దాన్ని వైరల్ చేయడంతో వ్యవహారం దూరం వెళ్లిపోయింది. నేరుగా అతన్నే అడిగితే ఇదంతా అబద్దమని సాంకేతికంగా నిరూపించి క్లారిటీ ఇచ్చాడు.

దీనికి సంబంధించిన మరో స్టోరీ మనం చూడాలి. రా మచ్చ పాట రిలీజయ్యాక కొందరు ఫ్యాన్స్ సంగీత దర్శకుడు తమన్ ని ట్యాగ్ చేస్తూ తమకు రామ్ చరణ్ వేసుకున్న చొక్కా లాంటిది కావాలని ట్వీట్లు పెట్టారు. దానికి స్పందించిన తమన్ గేమ్ ఛేంజర్ అఫీషియల్ టీమ్ కి వీటిని రీ ట్వీట్ చేస్తూ పంపమని కోరాడు. దాంతో అవి సదరు అభిమానులకు చేరిపోయాయి. వాళ్ళు చొక్కాలు వేసుకుని రీల్స్, షార్ట్స్ పెట్టారు. ఇదంతా చాలా సందర్భాల్లో ఎన్నో సినిమాలకు చేసిన ప్రమోషన్ లాంటిదే. కొత్తగా చేసింది కాదు. ఇంతకు ముందు చూడనిది కాదు. కొందరి అత్యుత్సాహ ప్రచారం ఇంత రగడకు కారణం.

ఇదంతా ఎలా ఉన్నా రా మచ్చ సాంగ్ ఊహించిన దానికన్నా పెద్ద స్థాయిలో రీచ్ అయిన మాట వాస్తవం.చాలా చోట్ల ఈవెంట్స్ లో దీనికి పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. దేవరలో ఫియర్, చుట్టమల్లే, దాయాది తర్వాత అంత బాగా జనంలోకి వెళ్ళింది రా మచ్చనే. జరగండి జరగండికి వచ్చిన నెగటివిటీ రెండో పాట విషయంలో జరగలేదు. అదే మెగా ఫ్యాన్స్ కి బోలెడు రిలీఫ్ ఇచ్చింది. త్వరలోనే మూడో సాంగ్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఈసారి ఫాస్ట్ బీట్స్ కాకుండా స్లో మెలోడీని తీసుకురాబోతున్నారు. రామ్ చరణ్, అంజలి మీద ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాటని ఇన్ సైడ్ టాక్. ఇదెలా ఉండబోతోందో చూడాలి.