దర్శన్‌ను రేణుక స్వామి ఆత్మ వెంటాడుతోందట

ప్లాన్ చేసి చేశారో.. లేక క్షణికావేశంలో చేశారో కానీ.. కన్నడ కథానాయకుడు దర్శన్ తన అభిమానే అయిన రేణుక స్వామి అనే వ్యక్తిని తన బృందంతో కలిసి దారుణంగా హింసించి హత్య చేయించిన విషయం కొన్ని నెలల కిందట ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే.

కారణాలు ఏవైనా కానీ.. రేణుకస్వామిని దర్శన్ అండ్ కో హింసించిన తీరు ఘోరాతి ఘోరం. తన గాయాలు, అనుభవించిన చిత్రహింస గురించి మీడియాలో రాయలేనంత ఘోరం జరిగింది. ఈ హత్యలో దర్శన్ స్వయంగా పాల్గొన్నట్లు ఆధారాలు ఉండడంతో అతను జైలు పాలయ్యాడు.

ఇప్పటిదాకా ఈ కేసులో అతడికి బెయిల్ కూడా రాలేదు. ఐతే బెంగళూరు జైల్లో దర్శన్‌కు మంచి సౌకర్యాలు అందుతున్నాయని మీడియాలో వార్తలు రావడంతో కొన్ని వారాల కిందట బళ్లారి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

కాగా తనను బెంగళూరు జైలుకే మార్చాలని దర్శన్ అధికారులను కోరుతున్నాడట. తనకు బళ్లారి జైల్లో నిద్రే పట్టడం లేదని.. రేణుకాస్వామి ఆత్మ తన కలలోకి వచ్చి వెంటాడుతోందని జైలు అధికారులకు చెబుతున్నాడట.

తాను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నానని.. తనను బెంగళూరు జైలుకు తరలించాలని దర్శన్ అధికారులను వేడుకుంటున్నాడట. అర్ధరాత్రి సమయంలో దర్శన్ నిద్రలో కలవరిస్తున్నట్లు.. గట్టిగా కేకలు వేస్తున్నట్లు తోటి ఖైదీలు జైలు అధికారులకు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ కేసులో దర్శన్‌తో పాటు అతను ఎవరి కోసం అయితే రేణుక స్వామిని హత్య చేశాడో, ఆ పవిత్ర గౌడ.. మరో 13 మందిని నిందితులుగా చేర్చి రిమాండుకు తరలించారు పోలీసులు. ఇటీవలే ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా వేశారు.

ఇందులో హత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి వివరిస్తూ.. రేణుకస్వామి విపరీత ప్రవర్తన గురించి పోలీసులు పేర్కొన్నారు. మారు అకౌంట్లతో రేణుకస్వామి.. పవిత్రకు దారుణమైన మెసేజ్‌లు పంపించినట్లు పోలీసులు తెలిపారు.

తాను నెలకు 10 వేల రూపాయలు ఇస్తానని.. తనతోనూ సహజీవనం చేయాలని రేణుకస్వామి.. పవిత్రకు మెసేజ్‌లు పెట్టినట్లు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. పవిత్ర వార్నింగ్ ఇచ్చినా వినకుండా ఇలాంటి మెసేజ్‌లే పెట్టి వేధిస్తుండడంతో ఆమె దర్శన్‌కు ఇవన్నీ చూపించడం.. అతను కోపోద్రిక్తుడై తన అనుచరులతో కలిసి రేణుకస్వామికి బుద్ధి చెప్పాలనుకోవడం.. ఈ క్రమంలో అతను హత్యకు గురి కావడం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.