లోకేష్ కనకరాజ్‌కు కోపమొచ్చింది

తమిళంలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకడు.. లోకేష్ కనకరాజ్. మామూలుగా అతను చాలా కూల్‌గా కనిపిస్తాడు. అలాంటి దర్శకుడికి ఇప్పుడు కోపం వచ్చింది. తన కొత్త చిత్రం ‘కూలీ’కి సంబంధించి ఊహాగానాలు ప్రచారం చేసినందుకు అతను యూట్యూబ్ ఛానెళ్ల మీద మండిపడ్డాడు.

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఐతే ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో భాగంగానే రజినీ ఇబ్బంది పడి ఆసుపత్రి పాలయ్యారని యూట్యూబ్ ఛానెళ్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. మామూలుగా ఇలాంటి ఊహాగానాలకు లోకేష్ స్థాయి దర్శకులు స్పందించరు. కానీ అతను మాత్రం ఈ విషయమై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రజినీ తన సమస్యకు చికిత్స చేయించుకోబోతునన్నట్ల చాలా ముందుగానే తమకు చెప్పినట్లు లోకేష్ కనకరాజ్ వెల్లడించాడు. ‘‘రజినీ సర్‌తో మాట్లాడాను. ఆయన బాగానే కోలుకుంటున్నారు. తాను ఓ సమస్యకు చికిత్స తీసుకోబోతున్నట్లు మా టీంకు ఆయన కొన్ని రోజుల ముందే చెప్పారు. కానీ కొందరు యూట్యూబర్లు మాత్రం ‘కూలీ’ షూటింగ్ సందర్భంగా ఆయనకు ఏదో అయినట్లు వార్తలు సృష్టించారు. ఇలాంటి వార్తలు చూస్తే చాలా కోపం వస్తుంది. మా షూటింగ్ కంటే రజినీ సర్ ఆరోగ్యమే మాకు ముఖ్యం. సెట్లో ఆయనకు నిజంగా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే షూటింగ్ ఆపేస్తాం. యూట్యూబ్‌లో ఇష్టం వచ్చినట్లు వార్తలు సృష్టించి జనాలను బాధ పెట్టకండి. ఇలాంటివి ఇక ఆపండి. రజినీ సార్ అక్టోబరు 15 నుంచి మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారు’’ అని ‘కూలీ’ షూట్ అప్‌డేట్ కూడా ఇచ్చాడు లోకేష్ కనకరాజ్.

ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.