బాలయ్య ఫేవరెట్ విలన్ ఇక లేరు

తొంభై దశకంలో మాస్ హీరోగా తిరుగులేకుండా దూసుకుపోతున్న టైంలో బాలకృష్ణకు విలన్ గా నటించిన మోహన్ రాజ్ అలియాస్ కీరికదన్ జోస్ నిన్న అనారోగ్యంతో కన్ను మూశారు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణముంది. రావుగోపాలరావు, రామిరెడ్డి, నూతన ప్రసాద్ ఇలా పరిమిత విలన్లతో టాలీవుడ్ కొత్త మొహం కోసం ఎదురు చూస్తున్న టైంలో రౌడీయిజం నశించాలితో మోహన్ రాజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అందులో గుడివాడ రౌడీగా తన పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అచ్చు తప్పు అంటూ పలికే మ్యానరిజం వరస ఆఫర్లు తీసుకొచ్చింది. అసెంబ్లీ రౌడీ మరో బ్రేక్.

రౌడీ ఇన్స్ పెక్టర్ లో బొబ్బర్లంక రామబ్రహ్మాం మరో మేలి మలుపు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో బాలయ్యతో సవాల్ చేయించునే సీన్ బాగా పండేందుకు కారణం ఇదే. ఆ తర్వాత నిప్పు రవ్వ, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, పవిత్ర ప్రేమ, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు ఇలా ఎన్నో చిత్రాల్లో బాలకృష్ణతో కలిసి స్క్రీన్ పంచుకున్నాడు. అప్పట్లో బి గోపాల్ ప్రతి చిత్రంలో ఈయన ఉండేవారు. వెంకటేష్ పవిత్ర బంధం – సరదా బుల్లోడు – పోకిరిరాజా, రాజశేఖర్ శివయ్య, మోహన్ బాబు సోగ్గాడి పెళ్ళాం, చిరంజీవి మెకానిక్ అల్లుడు, నాగార్జున ఇద్దరూ ఇద్దరే మోహన్ రాజ్ ఫిల్మోగ్రఫీలో కీలకం.

మూడు వందల సినిమాలకు పైగా నటించిన ఈ విలక్షణ విలన్ తిరువనంతపురంలో కన్ను మూశారు. ఆర్మీలో చేరాలనుకుని శిక్షణ తీసుకుని కాలికి గాయం కావడంతో విరమించుకున్నాడు. ఎకనామిక్స్ లో డిగ్రీ చదివి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో ఏఈఓగా పని చేశారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఉద్యోగం మానుకోలేదు. కేరళలో పుట్టిపెరిగిన మోహన్ రాజ్ తెలుగు బాగా మాట్లాడేవాడు. డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పినా తెరమీద గంభీరమైన ఆయన విగ్రహం యాక్షన్ ఎపిసోడ్లకు బాగా ఉపయోగపడేది. 2005 శివశంకర్ తర్వాత మళ్ళీ తెరమీద కనిపించని మోహన్ రాజా ఇక శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.