ధృవ విలన్ వెనుక హెల్త్ ట్రాజెడీ

నిన్నటి తరం ప్రేక్షకులకు అరవింద్ స్వామి అంటే రోజా, బొంబాయి లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించిన అందమైన హీరోగా పరిచయం. ఈ జనరేషన్ కు తను బాగా రిజిస్టరయ్యింది రామ్ చరణ్ ధృవతోనే. కూల్ విలనీని అతను పండించిన తీరు ఆ సినిమా గొప్ప విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అక్కడి నుంచి అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. వరసగా అవకాశాలు క్యూ కట్టాయి. టైం లేక కొన్ని క్రేజీ ప్రాజెక్టులు సైతం వదులుకోవాల్సి వచ్చింది. ఇటీవలే సత్యం సుందరంలో కార్తీతో తెరను పంచుకున్న అరవింద్ స్వామికి మరో గొప్ప క్లాసిక్ ఖాతాలో పడింది.

ఇదంతా బాగానే ఉంది కానీ రోజా పువ్వు కింద ముళ్ళు ఉన్నట్టు అరవింద్ స్వామి జీవితంలోనూ ఒక బ్లాక్ పీరియడ్ ఉండిపోయింది. అదేంటంటే సినిమాలు తగ్గుతున్న టైంలో తనకు వెన్నెముకకు కలిగిన గాయం రెండేళ్ల పాటు మంచానికి పరిమితం చేసింది. ఆ నొప్పి మాములు నరకం చూపించలేదు.

సరిగ్గా అప్పుడే కాలికి తాత్కాలిక పక్షవాతం రావడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఒకటి రెండు కాదు ఏకంగా పదమూడు సంవత్సరాల పాటు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం ముఖ్యమనుకుని ఇంటివద్దే ఉండిపోయాడు. తనకు లైఫ్ ఇచ్చిన మణిరత్నమే కడలి కోసం పిలిచే దాకా మేకప్ వేసుకోలేదు.

ఆ మూవీ డిజాస్టర్ అయినా అరవింద్ స్వామి మళ్ళీ వచ్చాడనే సందేశం దర్శక నిర్మాతలకు తీసుకెళ్లింది. వాటిలో భాగంగా వచ్చిందే తని ఒరువన్. తెలుగులో రీమేక్ అనుకున్నప్పుడు విలన్ పాత్రని డాక్టర్ రాజశేఖర్ ఏరికోరి చేయాలనుకుంటే ఒరిజినల్ వెర్షన్ ఫీల్ మిస్సవుతుందని భావించి రామ్ చరణ్ తో తలపడేందుకు అరవింద్ స్వామినే ఒప్పించి తీసుకొచ్చారు. ఆ మధ్య నాగ చైతన్య కస్టడీలో నటించాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఇప్పుడు సత్యం సుందరం మళ్ళీ ఇంకో బ్రేక్ ఇచ్చింది. టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ కోలీవుడ్ డిమాండ్ వల్ల ఇక్కడ సినిమాలు చేయలేకపోతున్నాడు.