తేదీ మారదంటున్న దిల్ రాజు పట్టుదల

మెగా ఫ్యాన్స్ మూడేళ్లుగా ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ విడుదల విషయంలో ఇంకా దోబూచులాట తీరలేదు. ముందు డిసెంబర్ 20 అన్నారు. డిస్ట్రిబ్యూషన్ వర్గాల వద్ద డిసెంబర్ 25 సమాచారం ఉంది. కేవలం పదిహేను రోజుల గ్యాప్ లో విశ్వంభరతో పాటు ఇతర సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఇంకాస్తా ముందు వస్తే భారీ వసూళ్లు దక్కుతాయనేది అభిమానుల వర్షన్. నిజానికి దర్శకుడు శంకర్ ఈ రోజుకీ ఎప్పుడు సెన్సార్ ఫైనల్ కట్ ఇస్తానని ఖచ్చితంగా చెప్పడం లేదట. క్షణం తీరిక లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటూ డెడ్ లైన్ మిస్ చేయకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నట్టు టాక్ ఉంది.

కొద్దిరోజుల క్రితం విశ్వంభర వాయిదా పడొచ్చని, సంక్రాంతికి దాని స్థానంలో గేమ్ ఛేంజర్ ఉంటుందనే వార్త ట్రేడ్ లో బలంగా తిరిగింది. కానీ దిల్ రాజు మాత్రం పట్టుదలతో క్రిస్మస్ కే గేమ్ ఛేంజర్ రిలీజ్ చేయాలని సంకల్పించుకున్నారట. దానికి తగ్గట్టే ఇటీవలే రా మచ్చా సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నొక్కి మరీ డిసెంబర్ రిలీజని చెప్పారు. శంకర్ ఆ మాట అనకపోయినా నిర్మాత ఉద్దేశమేంటో ఆ రకంగా బయట పడిందన్న మాట. ఇకపై నాన్ స్టాప్ గా ప్రమోషన్లు ఉంటాయని చెప్పడంతో ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకున్నారు. దసరాకు టీజర్ వదిలే ప్లానింగ్ తో ప్రస్తుతం ఎడిటింగ్ చేయిస్తున్నారు.

సో గేమ్ ఛేంజర్ చెప్పిన టైంకి రావడం వెనుక దిల్ రాజు పట్టుదలే దన్నుగా నిలబడాలి. చూద్దాంలే అని నిర్లిప్తంగా ఉంటే శంకర్ మరింత ఆలస్యం చేసే రిస్క్ లేకపోలేదు. ఆయనకూ ఇది చాలా ఒత్తిడి సమయం. ఇండియన్ 2 మీద వచ్చిన దారుణమైన విమర్శల మచ్చ పోవాలంటే గేమ్ ఛేంజర్ ఆషామాషీ హిట్ అయితే సరిపోదు. మ్యూజికల్ గా రెండు పాటలు పాసయ్యాయి కాబట్టి తర్వాత వచ్చే మూడు సాంగ్స్ మీద హైప్ పెరిగిపోయింది. ఇక టీజర్ వచ్చాక బిజినెస్ డీల్స్ ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. నవంబర్ నుంచి కియారా అద్వానీతో పాటు ఇతర ఆర్టిస్టులని ప్రమోషన్స్ లో భాగం చేయబోతున్నారు.