స్వాగ్ టీమ్ నమ్మకాన్ని మెచ్చుకోవాల్సిందే

ఏ సినిమా అయినా బాగా తీశామనే నమ్మకం దర్శక నిర్మాతల్లో ఖచ్చితంగా ఉంటుంది. అది నిజమవుతుందో లేదో రిలీజయ్యాక ప్రేక్షకుల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని వ్యక్తం చేసే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో పద్దతిని ఫాలో అవుతారు.

ఆ మధ్య విశ్వక్ సేన్ పాగల్ ఆడకపోతే పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేయడం వైరలయ్యింది. అఫ్కోర్స్ అది కమర్షియల్ గా వర్కౌట్ కావడంతో సవాల్ నిలబెట్టుకోవాల్సిన అవసరం లేకపోయింది. రాజరాజ చోర ఈవెంట్ లో శ్రీవిష్ణు తన కాన్ఫిడెన్స్ ని మాటల్లో చూపించినప్పుడు కొందరు నోరు నొక్కుకున్నారు కానీ అతనే గెలిచాడు.

ఎల్లుండి స్వాగ్ రిలీజ్ కాబోతోంది. శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని నిర్మించింది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో ఒక్కొక్కరి మాటలు వింటూ వింటే ఇదేదో ఆషామాషీ చిత్రం కాదనే విషయం అర్థమైపోతోంది.

దర్శకుడు హసిత్ మాట్లాడుతూ 2024లోనే బెస్ట్ నాలుగో మూవీ, బెస్ట్ ఇంటర్వెల్, బెస్ట్ క్లైమాక్స్ తమదే అవుతుందని, గత కొన్నేళ్లలోనే కాదు రాబోయే సంవత్సరాల్లో కూడా స్వాగ్ లాంటి మూవీ రాలేదని అంటారని ధీమాగా చెప్పుకొచ్చాడు. శ్రీవిష్ణు సైతం ఇదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ తెలుగువాళ్ళు గర్వపడేలా స్వాగ్ ఉంటుందని హామీ ఇచ్చాడు.

ఈ లెక్కన స్వాగ్ కంటెంట్ మాములుగా ఉండేలా ఉంది. అక్టోబర్ 4 పెద్దగా పోటీ లేనప్పటికీ దేవర రెండో వారంలో అడుగు పెడుతున్న టైంలో జనాన్ని తనవైపు లాగడం శ్రీవిష్ణుకి అంత సులభం కాదు.

అయితే ట్రైలర్ ని వెరైటీగా కట్ చేయడం, హీరో నాలుగు పాత్రలు చేయడం, ప్రతి క్యారెక్టర్ కు డ్యూయల్ రోల్ ఉంటుందనే హింట్ ఇవ్వడం లాంటి అంశాలు యువతలో అంచనాలు పెంచుతున్నాయి. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ తనకు ఫ్లాపుల నుంచి ఊరట కలిగించి తిరిగి ఆఫర్లు కురిపించేలా స్వాగ్ బ్లాక్ బస్టరవుతుందనే ధీమాతో ఉంది. సరిపడా థియేటర్లతో స్వాగ్ కు మంచి రిలీజ్ దక్కనుంది.