పవన్ హెచ్చరికకు స్పందించిన నటులు

తిరుమల లడ్డులో కల్తీ జరిగిన వివాదం కొత్త మలుపులు తీసుకుంటూ అసలు సంబంధమే లేని నటుల మధ్య చర్చకు దారి తీస్తోంది. ఇటీవలే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేస్తూ సెక్యులరిజంని కాపాడమని పెట్టిన ట్వీట్ దుమారం రేపింది. అందులో ప్రత్యేకంగా మతాల మధ్య విభేదాలు రాకుండా చూడమని కోరడం పట్ల ఇవాళ డిప్యూటీ సిఎం విజయవాడ ప్రెస్ మీట్ లో నటుడిగా ప్రకాష్ రాజ్ కు గౌరవం ఇస్తూనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని హెచ్చరిక చేయడం హాట్ టాపిక్ అయ్యింది. హీరో కార్తీ సత్యం సుందరం ఈవెంట్ లో లడ్డుని సెన్సిటివ్ ఇష్యూ అనడం పవన్ ఆగ్రహానికి కారణమయ్యింది.

అసలు మౌనంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదని, కామెడీ చేయడం భావ్యం కాదని పవన్ కార్తీని ఉద్దేశించి అన్నారు. దీనికి ఇద్దరూ స్పందించారు. విదేశాల్లో షూటింగ్ లో ఉన్న ప్రకాష్ రాజ్ ఏకంగా వీడియో రూపంలో మెసేజ్ పోస్ట్ చేసి తిరిగి వచ్చాక అన్ని ప్రశ్నలకు వివరంగా సమాధానం చెబుతానని, వీలైతే తన ట్వీట్ మళ్ళీ చదువుకోమని విన్నవించారు. కార్తీ ఏకంగా క్షమాపణ కోరాడు. తన మాటలను అపార్థం చేసుకుని ఉంటే క్షమించాలని, మీరంటే ఎంతో అభిమానమని ఎలాంటి కాంట్రావర్సికి తావివ్వకుండా ముగించాడు. ఇద్దరి స్పందనలు ఇప్పుడు వైరలవుతున్నాయి.

ఇప్పటికే రాజకీయ రంగు పులుముకుని జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన లడ్డు వ్యవహారం ఇప్పుడు యాక్టర్స్ మధ్య కూడా విభేదాలు తీసుకొచ్చేలా ఉంది. అయినా అవసరం లేని విషయాల్లో మాట్లాడితే కొన్నిసార్లు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. నిజానికి కార్తీ తానుగా లడ్డు గురించి మాట్లాడలేదు. అది పూర్తిగా యాంకర్ తప్పు. నవ్వుతూ సమాధానం చెప్పడం వల్ల కార్తీ టార్గెటయ్యాడనేది అభిమానుల వెర్షన్. ఇక ప్రకాష్ రాజ్ ముందు నుంచి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ మాత్రం ఈ టాపిక్ మీద రెండూగా విడిపోయి వాదనలు చేసుకుంటున్నారు