నేటి సెన్సేషన్.. నాడు అమృతంలో

సత్య.. సత్య.. సత్య.. టాలీవుడ్లో గత ఐదారు రోజులుగా ఈ పేరు మార్మోగుతోంది. ఒక సినిమాను ఓ కమెడియన్ నిలబెట్టడం అన్నది అరుదుగా జరిగే విషయం. బ్రహ్మానందం, సునీల్ లాంటి కమెడియన్లకు ఒకప్పుడు ఆ స్థాయి ఉండేది. తర్వాత వెన్నెల కిషోర్ కొంతమేర ఆ స్థాయిని అందుకున్నాడు.

ఇప్పుడు సత్య ఒంటి చేత్తో ‘మత్తు వదలరా-2’ సినిమాను నిలబెట్టి.. ఆ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణంగా మారడంతో అందరూ తన గురించి మాట్లాడుకుంటున్నారు. విడుదలకు ముందు ట్రైలర్ చూసినపుడే ఈ సినిమాలో సత్య అదరగొట్టేయబోతున్నాడని అర్థమైంది. సినిమాలో తన క్యారెక్టర్.. అందులో సత్య పెర్ఫామెన్స్ అంచనాలను మించిపోయాయి. నాన్ స్టాప్ కామెడీతో ప్రేక్షకులకు మంచి కాలక్షేప వినోదాన్ని అందించడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయింది. కెరీర్లో ఇన్నేళ్లలో వచ్చినా గుర్తింపు అంతా ఒకెత్తయితే.. ‘మత్తు వదలరా-2’తో అతడికి వచ్చిన గుర్తింపు మరో ఎత్తు.

సత్య ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ గత ఐదారేళ్లుగానే అతను బిజీగా ఉంటున్నాడు. తన పేరు అందరికీ తెలియడానికి, కమెడియన్‌గా బిజీ అవడానికి చాలా కాలమే పట్టింది. సత్య దాదాపు 20 ఏళ్ల కిందట్నుంచే ఇండస్ట్రీలో ఉన్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఒకప్పుడు జెమిని టీవీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘అమృతం’ సీరియల్లో సత్య నటించడం విశేషం. ఒక ఎపిసోడ్లో అతను చిన్న పాత్ర చేశాడు. అప్పుడు అతడికి సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే అవకాశం కూడా రాలేదు. ఇంకెవరో వాయిస్ ఇచ్చారు. మంచి వాయిస్ ఉన్నప్పటికీ సత్యకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

‘అమృతం’ సీరియల్లో అప్పుడప్పుడూ నటులు కాని వాళ్లు, టెక్నీషియన్లు కూడా చిన్న చిన్న పాత్రలు చేసేవారని తెలిసిందే. సత్య కూడా అలాగే అందులో నటించినట్లున్నాడు. ఎందుకంటే కెరీర్ ఆరంభంలో అతను దర్శకుడు కావాలనుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు. ఐతే అనుకోకుండా నటనలోకి వెళ్లాడు. ‘పిల్ల జమీందార్’, ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమాలు అతడికి కొంత గుర్తింపునిచ్చాయి. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు పెరిగాయి. ఛలో, మత్తు వదలరా లాంటి సినిమాలు అతడి కెరీర్‌ను మార్చేశాయి. ఇప్పుడు ‘మత్తు వదలరా-2’తో వేరే స్థాయికి వెళ్లిపోయాడు.