ఇస్మార్ట్’కు జరిగినట్లే.. ‘గోట్’కు

రిలీజ్ ముంగిట సినిమాకు హైప్ తేవడానికి రకరకాల గిమ్మిక్కులు చేస్తుంటారు మేకర్స్. ఇందులో భాగమే.. థియేట్రికల్ బిజినెస్ గురించి గొప్పలు చెప్పుకోవడం.. మీడియాకు పనిగట్టుకుని లీక్స్ ఇవ్వడం.

ఈ మధ్య కాలంలో ఇలా థియేట్రికల్ రైట్స్ డీల్‌ను మరీ ఎక్కువ చేసి చూపించిన సినిమా అంటే.. ‘డబుల్ ఇస్మార్ట్’యే. ఆ సినిమా థ్రియేట్రికల్ హక్కులను రూ.60 కోట్లకు హోల్‌సేల్‌గా కొనేసి ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనేసి రిలీజ్ చేస్తున్నట్లు ఘనంగా ప్రకటనలు ఇచ్చుకున్నారు.

ఆ సినిమాకు ఉన్న హైప్‌కి, ఈ డీల్ చాలా ఎక్కువగా అనిపించింది. అందులో సగం షేర్ అయినా ఈ సినిమా వెనక్కి తేగలదా అన్న సంశయాలు కలిగాయి. చివరికి అనుమానాలే నిజమయ్యాయి. సగం కాదు కదా.. పావు వంతు షేర్ రాబట్టడానికి కూడా ఆపసోపాలు పడింది ‘డబుల్ ఇస్మార్ట్’.

ఇప్పుడు తమిళ అనువాద చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ తెలుగు వెర్షన్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. విజయ్ గత సినిమాలతో పోలిస్తే దీనికి రిలీజ్ ముంగిట బజ్ క్రియేట్ కాలేదు. ఐతే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏకంగా రూ.22 కోట్లకు కొని రిలీజ్ చేస్తున్నట్లు మీడియాకు లీక్స్ ఇచ్చారు. అది చాలా పెద్ద నంబర్. నమ్మశక్యంగా అనిపించలేదు.

మంచి హైప్ వచ్చిన ‘లియో’ మూవీ మీదే రూ.15 కోట్లు పెడితే.. దీనికి ఇంకో 50 శాతం ఎలా పెరుగుతుంది? ఇది హైప్ పెంచడానికి చేసిన గిమ్మిక్ అనడంలో సందేహం లేదు. తీరా చూస్తే ‘గోట్’ తెలుగు వెర్షన్’ 5 కోట్ల షేర్ మార్కును అందుకోవడానికి కూడా కష్టపడిపోయింది.

ప్రచారంలో ఉన్న ఫిగర్లో నాలుగో వంతు షేర్ కూడా రాబట్టలేదీ సినిమా. దీన్ని బట్టి సినిమాలో విషయం లేకుండా థియేట్రికల్ డీల్స్ గురించి హైప్ చేసి లీక్స్ ఇచ్చుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదని మరోసారి రుజువైంది.