కూలీ ప్లాన్లు చూస్తే మతి పోవాల్సిందే

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలిలో తోడవుతున్న స్టార్ అట్రాక్షన్లు అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. నాగార్జున ఇప్పటికే సెట్లో అడుగు పెట్టగా ఉపేంద్ర ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్నాడు. త్వరలో అమీర్ ఖాన్ ప్రవేశిస్తాడని చెన్నై టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ ప్రాధమికంగా స్టోరీకి సంబంధించిన డిస్కషన్ లోకేష్, అమీర్ ల మధ్య జరిగిందని, ఒకవేళ ఓకే అయితే మాత్రం ఇండియాలోనే మోస్ట్ సెన్సేషనల్ మల్టీస్టారర్ గా కూలి నిలుస్తుందని చెప్పొచ్చు. అగ్రిమెంట్ అయిపోయి సంతకాలు జరిగితేనే అధికారిక ప్రకటన వస్తుంది.

జైలర్ లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ క్యామియోలు బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యాక చాలా మంది దర్శకులు ఆ రూట్ లో ఆలోచించడం మొదలుపెట్టారు. దీనికన్నా ముందే లోకేష్ కనగరాజ్ తన విక్రమ్ లో సూర్య పోషించిన రోలెక్స్ క్యారెక్టర్ ద్వారా ఈ ట్రెండ్ సృష్టించాడు కానీ ఈసారి దాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు. బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న కూలిలో ఎనభై దశకం నాటి కథ ఉంటుందట. ఏ పాత్ర తాలూకు డీటెయిల్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ కూడా రజనికి జోడినా కాదా అనేది బయట పెట్టడం లేదు.

వచ్చే ఏడాది విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న కూలి ఖచ్చితంగా ప్రభాస్ రికార్డులు బద్దలు కొడుతుందనే నమ్మకం తలైవర్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం మీద భారీ హైప్ ఉంది. వచ్చే నెల వెట్టయన్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న రజనీకాంత్ ఆపై ఏడాది తిరక్కుండానే 2025లో కూలితో వచ్చేస్తారు. ఏడాదికి ఒక సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఈ వయసులోనూ వేగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవలే వచ్చిన మానసిలాయో వీడియో సాంగ్ ఆన్ లైన్ లో చేస్తున్న హల్చల్ మాములుగా లేదు. ఎక్కడ చూసినా మంజు వారియర్ స్టెప్పుల గురించే చర్చ.