రాజ్ తరుణ్ సేఫ్ కాదు

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వివాదం కొన్ని వారాల పాటు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. లావణ్య చౌదరి అనే అమ్మాయి తనతో ఎన్నో ఏళ్ల పాటు రాజ్ సహజీవనం చేయడమే కాక, పెళ్లి కూడా చేసుకున్నాడని.. కానీ ఇప్పుడు తనను వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని తీవ్ర ఆరోపణలే చేసింది.

ఈ వివాదం మీడియాలోకి ఎక్కి రచ్చ రచ్చ అయింది. ఐతే మీడియాలో కొన్ని రోజులు హాట్ టాపిక్‌గా ఉన్న ఈ వ్యవహారం తర్వాత సద్దుమణిగినట్లు కనిపించింది. తన కొత్త చిత్రం ‘భలే ఉన్నాడే’కు సంబంధించిన ప్రెస్ మీట్లో రాజ్ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. తాను ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నట్లు చెప్పాడు. ఈ ఇష్యూ సైలెంట్ అయినట్లే అతను మాట్లాడాడు. దీంతో రాజ్ ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు లావణ్య పెట్టిన కేసుల ఆధారంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అందులో రాజ్ తరుణ్‌ను నిందితుడిగా పేర్కొన్నారు. రాజ్, లావణ్య పదేళ్ల పాటు కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్లుగా అందులో పేర్కొంటూ ఇందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. రాజ్, లావణ్యలు కలిసి ఉన్న ఇంటి దగ్గర సాక్ష్యాలు సేకరించామని.. ఈ కేసులో అతను నిందితుడే అని పోలీసులు స్పష్టం చేశారు.

ఐతే ఈ కేసులో రాజ్ ముందస్తు బెయిల్ తీసుకుని ఉన్నాడు. ఛార్జ్ షీట్లో నిందితుడిగా పేర్కొంటూ రాజ్‌కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేసిన నేపథ్యంలో రాజ్ ఈ కేసులో సేఫ్ ఏమీ కాదని స్పష్టమవుతోంది. అతణ్ని అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. లావణ్యతో ప్రైవేటుగా సెటిల్ చేసుకోని పక్షంలో రాజ్‌కు ఇబ్బందులు  తప్పేలా లేవు.