మోక్షజ్ఞ కోసం బాలయ్య జాగ్రత్తలు

నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు ఏళ్ళ తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ నిరీక్షణ ఫలించే టైం వచ్చేసింది. ఈ నెల ఆరున గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోందని ఇన్ సైడ్ టాక్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ప్యాన్ ఇండియా మూవీలో తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తారనే లీక్ ఉంది కానీ నిర్ధారణగా తెలియాలంటే పూజా రోజు దాకా వెయిట్ చేయాలి. ఇక మోక్షజ్ఞ విషయంలో తాను అనుసరించబోయే ప్రణాళిక గురించి నట స్వర్ణోత్సవ సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో వెల్లడించారు.

డిగ్రీ పూర్తి చేసుకున్న మోక్షజ్ఞ ఆ తర్వాత న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇండియాకు తిరిగి వచ్చాక వైజాగ్ సత్యానంద్ దగ్గర మెళకువలు సాధన చేసి డాన్స్, ఫైట్లకు సంబంధించి తర్ఫీదు పొందాడు. ఈ క్రమంలో బాలయ్య తన కొడుక్కి మూడు సలహాలు ఇచ్చారు. గొప్ప ఫ్యామిలని ఫీలవ్వకుండా వారసత్వ భారాన్ని మోయకూడనేది మొదటిది. ఎవరిని అనుకరించకపోవడం రెండోది. క్రమశిక్షణతో ఉంటూ ఎక్కువ సినిమాలు చేయడం మూడోది. ఆర్టిస్టు అనేవాడు ఎప్పుడూ కనపడుతూ, బిజీగా ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుందనే సూత్రాన్ని ప్రత్యేకంగా చెప్పారట.

బాలకృష్ణ ఇండస్ట్రీకొచ్చిన తొలినాళ్ళలో తప్ప నాన్న ఎన్టీఆర్ ఎప్పుడూ వారసుడి కథల ఎంపికలో జోక్యం చేసుకోలేదు. కె విశ్వనాథ్ తీసిన జననీ జన్మభూమి తప్ప వేరే ఏ సినిమా చూడలేదు. కానీ మోక్షజ్ఞకు బాలయ్య ఈ పద్ధతి ఫాలో కావడం లేదు. చాలా అంచనాలు ఉన్నాయి కాబట్టి సబ్జెక్టుల ఎంపికని తండ్రిగా ఆయనే తీసుకున్నారు. అమరశిల్పి జక్కన్న తరహాలో ఒక శిల్పం లాగా వారసుడిని రెడీ చేస్తారట. డెబ్యూ మూవీకి రెండో కుమార్తె తేజస్విని నిర్మాతగా వ్యవహరించబోవడం అందులో భాగమే. కొంత ఆలస్యమైనా మోక్షజ్ఞ విషయంలో బాలకృష్ణ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్థమవుతోందిగా.