‘మిస్టర్ బచ్చన్’పై నిర్మాత పోస్టుమార్టం ఇదే..

ఇండిపెండెన్స్ డే వీకెండ్లో తెలుగులో నాలుగు సినిమాలు రిలీజైతే.. అందులో అత్యధిక అంచనాలతో వచ్చింది ‘మిస్టర్ బచ్చన్’ మూవీనే. కానీ చివరికి రిజల్ట్ కోణంలో చూస్తే మాత్రం అన్నిటికంటే దిగువన నిలిచింది. చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్‌గా రిలీజ్‌కు ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేసింది.

కానీ ఆ షోల నుంచే నెగెటివ్ టాక్ మొదలై.. మరుసటి రోజు ఉదయానికే ఆశించిన స్థాయిలో జనం థియేటర్లు కళ తప్పాయి. వీకెండ్లో కూడా సినిమా సరిగా పెర్ఫామ్ చేయలేక రవితేజ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.

ఐతే ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఉండగానే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ‘మిస్టర్ బచ్చన్’పై పోస్టుమార్టం నిర్వహించారు. సినిమా ఇంకా ఆడుతోంది కాబట్టి లోతుగా మాట్లాడలేను అంటూనే ఫెయిల్యూర్‌కు కారణాలు చెప్పారు విశ్వప్రసాద్.

ఈ సినిమా స్క్రిప్ట్ ఉండాల్సినంత బలంగా లేదని రిలీజ్‌కు ముందే తాను దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓపెన్‌గా చెప్పేసినట్లు విశ్వప్రసాద్ వెల్లడించారు. మంచి కాంబినేషన్ కుదిరినా.. ఆ కాంబోకు తగ్గ బిగి సినిమాలో లేదని.. ముఖ్యంగా సెకండాఫ్ దెబ్బ కొట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘మిస్టర్ బచ్చన్’ ఫస్టాఫ్ డీసెంట్‌ అని.. ఒక కమర్షియల్ మూవీ నుంచి ఆశించే ఎంటర్టైన్మెంట్ అందులో ఉందని విశ్వప్రసాద్ అన్నారు. తాను హిందీ సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని కాబట్టి ప్రథమార్ధంలో వచ్చే హిందీ పాటల ట్రాక్స్ తనకంత ఇబ్బందికరంగా అనిపించలేదని.. ఐతే ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్‌ను అనుసరించి వాటిని తర్వాత ట్రిమ్ చేశామని చెప్పారు. సెకండాఫ్ మాత్రం సినిమాలో బిగి లేదని.. అందువల్లే రిజల్ట్ తేడా కొట్టిందని చెప్పారు.

ఐతే ఇవన్నీ పక్కన పెడితే ‘మిస్టర్ బచ్చన్’కు వచ్చిన వసూళ్లను బట్టి చూస్తే.. ఇంత పేలవంగా ఆడాల్సిన సినిమా మాత్రం కాదన్నారు విశ్వప్రసాద్. ఈ సినిమాను కొందరు పనిగట్టుకుని టార్గెట్ చేశారని.. సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వచ్చిందని.. అందుకు కారణం దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు, చేసిన వ్యాఖ్యలే అన్నట్లు పరోక్ష వ్యాఖ్యలు చేశారు విశ్వప్రసాద్.