బాలు పాడిన చివరి పాట ఇదేనా!

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేని బాధ ఆయన అభిమానులకు ఇప్పట్లో తీరేది కాదు. ఆయన పాటలే వారికి సాంత్వన. అదే సమయంలో ఆ పాటలు వింటుంటే ఆయన లేని లోటును మరింతగా ఫీలవుతారనడంలోనూ సందేహం లేదు. బాలు ఇంకా యాక్టివ్‌గా ఉంటూ.. అప్పుడప్పుడూ సినిమా పాటలు పాడుతూ.. ‘సింప్లీ ఎస్పీబీ’ యూట్యూబ్ ఛానెల్లో అనేక ఆసక్తికర విషయాలు చెబుతూ అభిమానులను ఎంగేజ్ చేస్తూ ఉండటం వల్ల అభిమానుల బాధ రెట్టింపవుతోంది.

ఇంకా వయసు పెరిగాక.. ఆయన పాటలు మానేసి.. ఇన్‌యాక్టివ్ అయిపోయిన స్థితిలో చనిపోయి ఉంటే అభిమానులకు ఇంత బాధ ఉండేది కాదేమో. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘డిస్కో రాజా’ సినిమాలో కూడా ఒక హుషారైన పాట (నువ్వు నాతో ఏమన్నావో..) పాడారాయన. తెలుగు వరకు ఆయన పాడిన చివరి పాట ఇదే.

తమిళంలో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో కూడా బాలు ఒక పాట పాడారు. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. అదే బాలు చివరి పాటేమో అనుకున్నారు. కానీ కాదు. ఆ తర్వాత కూడా ఒక పాటను రికార్డ్ చేశారు. అది చాలా పెద్ద సినిమానే కావడం విశేషం. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తె’ కోసం బాలు ఓ పాట పాడారు.

తన సినిమాల్లో ఇంట్రో సాంగ్‌లను బాలుతో పాడించుకోవడం రజినీకి అలవాటు. ఆయన చివరగా నటించిన ‘దర్బార్’లోనూ చుమ్మా కిళి (తెలుగులో దుమ్ము ధూళి) పాటను బాలునే పాడారు. అంతకుముందు ‘పేట’లోనూ మాస్ మరణం అంటూ ఓ పాట అందుకున్నారు. ఈ రెండు చిత్రాలకూ అనిరుధ్ సంగీత దర్శకుడు. ‘అన్నాత్తె’లోనూ రజినీ ఇంట్రో సాంగ్‌ను బాలునే పాడారు. ‘శౌర్యం’ శివ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీత దర్శకుడు. బాలుతో పాట రికార్డ్ చేసిన సందర్భంగా ఇమాన్, శివ బాలుతో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు ట్విట్టర్లో కనిపిస్తున్నాయి. అంటే బాలు లేకపోయినా.. ఆయన పాడిన కొత్త పాట వచ్చే ఏడాది సందడి చేయబోతోందన్నమాట.