ప్రభాస్ హను కలయిక అంచనాలకు మించి

ఇప్పుడున్న స్టార్ హీరోల్లో అత్యధిక మార్కెట్ ఉన్నప్పటికీ వేగంగా సినిమాలు చేయడంలో అందరికంటే ముందున్న ప్రభాస్ మరో కొత్త సినిమా ఇవాళ అధికారికంగా మొదలైపోయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వార్ డ్రామా ద్వారా ఇమాన్వి హీరోయిన్ గా పరిచయమవుతోంది. సీతారామం ద్వారా మృణాల్ ఠాకూర్ లోని టాలెంట్ ని పరిచయం చేసిన హను ఈసారి మరో ప్రతిభ కలిగిన బ్యూటీని తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లీక్స్ నెలల క్రితమే వచ్చినప్పటికీ ఫైనల్ గా ఈ రోజుతో అఫీషియలయ్యింది. దీని వెనుక పెద్ద సెటప్పే ఉంది.

1940 బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ యుద్ధవీరుడిగా కనిపించబోతున్నాడు. అణిచివేయబడిన వర్గాలకు ప్రతినిధిగా, చీకట్లో మగ్గుతున్న ఎన్నో జీవితాలకు వెలుగునిచ్చే యోధుడిగా చాలా పవర్ ఫుల్ పాత్రని డిజైన్ చేశారట. ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేదు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం డార్లింగ్ క్యారెక్టర్ ఇప్పటిదాకా కెరీర్ లోనే అత్యంత ప్రభావవంతమైన క్యారెక్టర్ గా చెబుతున్నారు. చరిత్రలో కప్పెట్టిన వాస్తవాలను వెలికి తీసి అన్యాయాలను నిలదీసేలా హను చాలా ఇంటెన్స్ తో డిజైన్ చేశాడట. కల్పిత కథే అయినప్పటికీ కొన్ని నిజ జీవిత సంఘటనలకు ఇందులో పొందుపరిచారట.

ది రాజా సాబ్ షూటింగ్ పూర్తయ్యాక ప్రభాస్ హనుల మూవీ పనులు వేగవంతం కాబోతున్నాయి. ఏడాదికి ఖచ్చితంగా రెండు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభాస్ దానికి తగ్గట్టే పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ తాలూకు స్క్రిప్ట్ పనులకు మరింత సమయం అవసరం పడటంతో కొంత టైం పట్టేలా ఉంది. పడి పడి లేచే మనసు రూపంలో డిజాస్టర్ అందుకున్న హను రాఘవపూడి సీతారామంతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైనం ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో సినిమా వచ్చేలా చేసింది. టయర్ 1 డైరెక్టర్ల లిస్టులో చేరడానికి ఇంతకన్నా ఛాన్స్ ఏముంటుంది.